దేశం అంతటా లాక్ డౌన్ రూల్స్ ఎంత కఠినంగా అమలవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందుకు తెలుగు రాష్ట్రాలు అతీతం కాదు. తెలంగాణలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ కి సడలింపు ఉంది. దీని తరువాత అత్యవసర పరిస్థితిల్లో తప్ప.., ఎవ్వరూ బయటకి రావడానికి వీలు లేదు. కానీ.., దూర ప్రాంతాలకి ప్రయాణించే వారికి ఈ రూల్స్ తెలియకపోవడం వల్లనో, మధ్యలో వాహనాలు అందుబాటులో లేకుండా పోవడం వల్లనో కష్టాలు తప్పడం లేదు. సరిగ్గా హైదరాబాద్ లో ఇద్దరు యువతులకు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. చేరుకోవాల్సిన గమ్యానికి ఎలా వెళ్ళాలో తెలియక రోడ్డుపై భయం భయంగా నిలబడిపోయిన ఆ ఇద్దరు యువతులకు డ్యూటీలో ఉన్న ఎస్ఐ చంద్రశేఖర్ అండగా నిలబడ్డారు. ఆ వివరాల్లోకి వెళ్తే.., ఇద్దరు యువతులు హైదరాబాద్ నుండి ఉట్నూర్ వెళ్లేందుకు బయలుదేరారు. వారు లక్షెట్టి పేట్ వరకు రాగానే లాక్ డౌన్ సమయం 10 దాటింది. అక్కడ నుండి ఎలాంటి ట్రాన్స్ పోర్ట్ లేకుండా పోయింది. వారికి నగరంలో తెలిసిన వారు కూడా లేరు. చేతిలో సరిపడే అంత డబ్బులు కూడా లేవు. దీనితో లక్షెట్టిపేట్ లో ఆగిపోయిన యువతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
సరిగ్గా ఇదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ చంద్ర శేఖర్, PSI హైమాలు వారి పరిస్థితి గమనించారు. దగ్గరికి వెళ్లి ఆరా తీశారు. ఆ యువతులు జరిగిందంతా చెప్పారు. ఎస్ఐ చంద్రశేఖర్ వెంటనే ఆదిలాబాద్ వైపు వెళ్తున్న కారును ఆపి అందులో ఇద్దరు యువతులను ఎక్కించాడు. యువతులు ఇద్దరిని వారి గ్రామంలో దింపమని వాహనదారుడిని కోరాడు. అమ్మాయిల ఫోన్ నెంబర్లు తీసుకుని..కారు నడిపేవారి మొబైల్, కారు నెంబర్లు కూడా తీసుకుని జాగ్రత్తగా వాళ్ళని సాగనంపారు. లాక్ డౌన్ లో ఇలా ఇద్దరు అమాయక యువతులకు సేఫ్ గా రవాణా సౌకర్యం కల్పించినందుకు పోలీసులకు థాంక్స్ తెలుపుతున్నారు ప్రజలు. ఒకవేళ పోలీసులు గమనించకుండా ఉంటే.. ఆ అమ్మాయిలు ఎన్ని కష్టాలు పడేవారన్న ఆలోచనే భయాన్ని కలిగిస్తోంది. ఇందుకే మానవత్వాన్ని చాటుకున్న ఎస్ఐ చంద్ర శేఖర్ కి నెటిజన్స్ అభినందనలు తెలియచేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.