అమరావతి- కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెల్ల మెల్లగా ఆంక్షలను సడలిస్తోంది. ఇప్పటి వరకు రాత్రి 9 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా, ఇకపై ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతులు ఇవ్వనున్నారు. అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ మేరకు కరోనా నివారణ, కొవిడ్ టీకా పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై వివాహది శుభకార్యాలకు 150 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అదే తెల్లవారుజామున కర్ఫ్యూ సమయంలో పెళ్లిళ్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సందేనని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశారు జారీ చేశారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో, స్కూళ్లలో కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. విధ్యార్ధుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. స్కూళ్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని, అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.