హైదరాబాద్- సంక్షేమ పధకాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ పోటీ పడుతున్నాయి. ఒక రాష్ట్రాన్ని మించి మరో రాష్ట్రం సంక్షేమ పధకాలను అమలు చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం మరో కొత్త పధకాన్ని అమల్లోకి తెస్తోంది. తెలంగాణ దళిత బంధు పేరుతో దళితుల కోసం ప్రత్యేకంగా ఓ సంక్షేమ పధకాన్ని ప్రవేశపెడుతోంది కేసీఆర్ సర్కార్.
కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం అమలు జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శనివారం దళిత బంధు పధకంపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో దశల వారీగా అమలు చేసే ఈ పథకం కోసం సుమారు 80 వేల కోట్ల రూపాయల నుంచి ఒక లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్లో దళిత బంధు ప్రారంభమవుతోంది. ఈ పధకం కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచి, దేశ దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేయబోతున్నదని ముఖ్యమంత్రి చెప్పారు.
అందరం కలిసి దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేద్దామని, దళిత ప్రజా ప్రతినిధులకు, మేధావులకు, కుల సంఘాల నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దలిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టబోతున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులతో సోమవారం సీఎం కేసీఆర్ సమావేశం కాబోతున్నారు.