వైజాగ్ రైల్వే జోన్ విషయంలో ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపిందా..? అంటే అవుననే జవాబు వచ్చింది. దేశంలో కొత్తగా రైల్వే జోన్ ఏర్పాటు చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇటీవల స్పష్టమైంది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం తేల్చేసింది. దేశంలో కొత్త రైల్వే జోన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో కేంద్రం లేదని పార్లమెంటు సాక్షిగా.. బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ జవాబిచ్చారు.
ప్రస్తుతం మనదేశంలో 17 రైల్వే జోన్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు కొత్త జోన్లను ఏర్పాటు ఉద్దేశం లేదని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. మంత్రి తన ప్రసంగంలో ఎక్కడా కూడా వైజాగ్ రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించ లేదు. రైల్వేజోన్ విషయం పై గతంలో ఓఎస్డీని నియమించి కేంద్రం మాట తప్పింది. ఈ విషయమై ఓఎస్డీ ఇచ్చిన నివేదిక పై కూడా కేంద్రం స్పందించలేదు.
ఇక తాజా పార్లిమెంట్ సమావేశంలో.. ఏపీకి రైల్వే జోన్ రాదని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ రైల్వేజోన్ విషయం పై కేంద్రం వద్ద జగన్ ప్రభుత్వం ప్రస్తావించలేదని.. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైల్వే జోన్ అంశాన్ని కేంద్రం పక్కన పెట్టిందని రైల్వేశాఖ సీనియర్ అధికారులు చెప్పినట్లు సమాచారం.