సెల్ఫోన్ ప్రస్తుతం అందరినీ కట్టుబానిసలుగా మార్చుతోంది. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకూ చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తనపై ఆధారపడేలా మలుచుకుంటోంది. దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారం, అత్యవసర పనుల కోసం అందుబాటులోకి వచ్చిన సెల్ఫోన్లను అవసరం లేని పనులకు వినియోగించుకుంటూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. కొందరు డ్యూటీల్లో కూడా ఫోన్లను వాడుతూ ప్రమాదాలకు కానీ, తప్పిదాలకు గాని గురవుతున్నారు. ఈ నేపధ్యంలో విధుల్లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు, ఎలకా్ట్రనిక్ పరికరాలను, సోషల్ మీడియాను వాడొద్దని బిహార్ పోలీసులను డీజీపీ ఎస్కే సింఘాల్ ఆదేశించారు. ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిపై క్రమశిక్షణ చర్య లు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న సమయంలోనూ చాలామంది పోలీసులు తమ ఫోన్లలో నిమగ్నమై ఉంటున్నారని ఫిర్యాదులు పెద్ద ఎత్తున రావడంతోనే డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నప్పుడు గానీ, వీఐపీ లేదా వీవీఐపీల బందోబస్తు డ్యూటీలో ఉన్నప్పుడు గానీ పోలీసులు తమ మొబైల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను వాడరాదని బీహార్ డీజీపీ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని సీనియర్ పోలీసు అధికారులందరికీ లేఖలు రాశారు. ఈ ఉత్తర్వులను ధిక్కరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో ఉండగా మహిళా/ పురుష పోలీసులు గానీ ఎంతో అప్రమత్తంగా ఉండాలని., లా అండ్ ఆర్డర్ సరిగా ఉండేలా చూడాలని ఆయన అన్నారు. అలాగే ప్రజలు ఎప్పుడు కోరినా వారికీ సాయపడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.