ముంబయి- షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసు అచ్చు సినిమా కధను తలపిస్తోంది. ఆర్యన్ ఖాన్ ను విడుదల చేయాలంటే 25 కోట్ల రూపాయలు ఇవ్వాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డిమాండ్ చేసినట్టు ప్రభాకర్ సాయీల్ అనే ప్రత్యక్ష సాక్షి ఆరోపణలు చేశాడు. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ 25 కోట్లలో 8 కోట్లను ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఇవ్వాల్సి ఉందని వారు మాట్లాడుకుంటుండగా విన్నానని అతను చెప్పాడు.
ముంబయి తీరంలో అక్టోబర్ 2న నౌకలో రేవ్ పార్టీ జరుగుతుండగా ఎన్సీబీ దాడి జరిగే సమయంలో కేపీ గోసావి అనే వ్యక్తితో కలిసి తాను అక్కడకు వెళ్లానని ఎన్సీబీ తరఫున 9 మంది సాక్షుల జాబితాలో ఉన్న ప్రభాకర్ చెప్పారు. ఎన్సీబీ తరఫున మరో సాక్షిగా ఉన్న గోసావికి తాను సెక్యూరిటీగా పనిచేస్తున్నట్లు తెలిపాడు. ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చాక శామ్ డిసౌజా అనే వ్యక్తితో గోసావి ఫోన్లో మాట్లాడాడని, 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేయాలని అతడికి చెబుతుండగా తాను విన్నానని చెప్పుకొచ్చాడు.
ఆఖరికి 18 కోట్ల రూపాయలకు డీల్ ఖరారు చేయాలని, అందులో 8 కోట్ల రూపాయలు సమీర్ వాంఖడేకు ఇవ్వాల్సి ఉందని డిసౌజాకు గోసావి తనకు చెప్పినట్టు ప్రభాకర్ చెప్పాడు. ఈ క్రమంలో గోసావి, డిసౌజాలను షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ కలిశారని తెలిపాడు. అంతే కాదు సమీర్ వాంఖడే, గోసావి తనతో 10 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని ప్రభాకర్ ఆరోపించారు.
ప్రస్తుతం గోసావి ఆచూకీ తెలియడం లేదని, అందుకే ప్రాణభయంతో తాను ఈ విషయాలను బయటపెట్టానని ప్రభాకర్ చెప్పాడు. ఎన్సీబీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ప్రభాకర్ ఈ ఆరోపణలు చేస్తున్నాడని ఆ సంస్థ అధికారులు ఖండించారు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్పై నేడు కోర్టు తీర్పు వెలువడనుంది. ఇటువంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం ఆసక్తిరేపుతోంది.