ప్రపంచంలో ఇప్పటికే ఎత్తైన విగ్రహాలు ఎన్నో అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇటీవల స్టాచ్యు ఆఫ్ యూనిటీ పేరుతో ప్రపంచంలోనే ఎతైన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న పర్యాటకులను ఇది తెగ ఆకరిస్తోంది. తాజాగా మరో అరుదైన ఆవిష్కరణ జరగనుంది. ప్రపంచంలోనే అతి ఎతైన శివుని విగ్రహం ‘ విశ్వాస్ స్వరూపం’ పేరుతో రాజస్థాన్ లో శనివారం ప్రారంభించనున్నారు. మరి.. ఈ విగ్రహం ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్ లోని రాజ్ సమంద్ జిల్లాలోని నాథ్ ద్వారా పట్టణంలో 369 అడుగుల ఎత్తైన భారీ శివుడి విగ్రహాన్ని రూపొందించారు. ప్రపంచంలో ఎత్తైన శివుడి విగ్రహంగా ఇది చరిత్రలోకి ఎక్కనుంది. దీనిని శనివారం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్, స్పీకర్ సీపీ జోషి ఇతర ప్రముఖుల సమక్షంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురవు మొరారీ బాపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తొమ్మిది రోజుల పాటు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించున్నారు. ఈ విగ్రహం ఉదయ్ పూర్ కు కేవలం 45 కి.మీ దూరంలో ఉంది. ఈ విగ్రహాన్ని తట్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలోని ఓ కొండపై ఈ శివుడి విగ్రహం ఏర్పాటు చేశారు. 20 కి.మీ దూరంలో నుంచి కూడా ఈ విగ్రహం కనిపిస్తుంది. శివుడి విగ్రహ నిర్మాణానికి మూడు వేల టన్నుల స్టీల్ ఉపయోగించారు. అలాగే 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీట్, ఇసుకను వాడారు.
ఈ భారీ శివుడు విగ్రహ నిర్మాణానికి దాదాపు పదేళ్ల సమయం పట్టింది. 2012లో ఆగష్టులో ఈ నిర్మాణానికి శంకుస్ఠాపన జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. అప్పట్లోనూ అశోక్ గెహ్లత్ , మొరారి బాపు ఆధ్వర్యంలోనే ఈ విగ్రహ నిర్మాణానికి పూజ జరిగింది. ఇక ఈ భారీ విగ్రహం గురించి ప్రాజెక్ట్ అధికార ప్రతినిధి జై ప్రకాశ్ మాలి మాట్లాడుతూ… ప్రపంచంలోనే ఈ శివుడి విగ్రహం ఎత్తైనదని,లోపలికి వెళ్లేందుకు వీలుగా లిప్టులు, మెట్లు, భక్తుల విశ్రాంతి కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించామని తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో రాత్రి సమయంలో కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ అందరికి దర్శనమిస్తుందని మాలి పేర్కొన్నారు.
250 కి.మీ వేగంతో వీచే గాలినైనా తట్టుకొగలిగే సామర్ధ్యం ఈ విగ్రహానికి ఉందని, విండ్ టన్నెల్ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించినట్లు మాలి తెలిపారు. అలానే 250 ఏళ్లు నిలిచేలా విగ్రహ నిర్మాణం సాగిందని తెలిపారు. ఇక్కడి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. బంగీ జంపింగ్ , జిపి లైన్ , గో కార్డు, ఫుడ్ కోర్టులు, అడ్వెంచర్ పార్కు, జంగిల్ కేఫ్ వంటివి ఉన్నాయి. శనివారం నుంచి తొమ్మిది రోజులపాటు సాగే కార్యక్రమాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు.. రామ్ కథను పఠించనున్నారు.