తల్లికోసం ఓ యువతి ఏ కూతురు చేయని సాహసాన్ని చేసింది. తనకు దూరంగా తల్లిని చూడటానికి ఏకంగా 24 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. అదికూడా జర్మనీ నుంచి ఇండియాకు బైక్పై వచ్చింది. బైక్ నడపటం రాకపోయినా.. తల్లిని కలవాలన్న కోరికతో అప్పటికప్పుడు బైక్ నడపటం నేర్చుకుంది. భర్తను వెంటబెట్టుకుని ఈ సాహసం చేసింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మేధా అనే యువతికి 2013లో హాక్ విక్టర్ అనే వ్యక్తితో పరిచయం అయింది. విక్టర్ జర్మనీకి చెందిన వ్యక్తి. ముంబైకి పని మీద వచ్చాడు. అప్పుడే మేధా, విక్టర్కు పరిచయం అయింది.
ఆ పరిచయం కాస్తా ఆనతి కాలంలో ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీరి పెళ్లికి ఇరుకుటుంబాల వారు అంగీకరించారు. అయితే, లాక్డౌన్కు ముందే మేధా జర్మనీ వెళ్లిపోయింది. అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. లాక్డౌన్ పెట్టిన తర్వాత మేధా తల్లిదండ్రులు, బంధుమిత్రులు పెళ్లికి జర్మనీ వెళ్లటం జరగలేదు. మేధా తల్లిదండ్రులు లేకుండానే పెళ్లి అయిపోయింది. వారు వీడియో కాల్లో కూతురి పెళ్లి చూసి సంతోషించారు. ఇక, అప్పటినుంచి మేధా తన తల్లిదండ్రులను కలవటం కుదరలేదు. కొన్ని నెలల క్రితం మేధా తల్లిదండ్రుల్ని చూడాలని అనుకుంది.
ఇండియాకు వెళ్లటం కూడా వినూత్నంగా వెళ్లాలని భావించింది. ఈ టైంలోనే బైక్పై వెళ్లాలన్న ఆలోచన వచ్చింది. బైక్పై భర్త వెనకాల కూర్చుని వెళ్లటం కంటే.. నడుపుకుంటూ వెళితే ఆరోగ్యానికి మంచిదని అనుకుంది. బైక్ రాకపోయినా తల్లిని చూడాలన్న బలమైన కోరికతో అప్పటికప్పుడు నేర్చుకుంది. మేధా, విక్టర్లు ఇద్దరూ జర్మనీనుంచి బైక్లపై ఇండియాకు ప్రయాణం అయ్యారు. 156 రోజుల్లో 18 దేశాలను చుట్టి ముంబై చేరుకున్నారు. నవంబర్ 27న కుటుంబసభ్యులను కలుసుకున్నారు. కుటుంబం వారికి సాంప్రదాయ పద్దతిలో ఘన స్వాగతం పలికింది. ప్రయాణం సందర్భంగా పాకిస్తాన్, ఇరాన్ దేశాల మీదనుంచి వచ్చామని, ఆ దేశాల వారు తమను ఆప్యాయంగా పలకరించారని మేధా తెలిపింది. పాకిస్తాన్ వాళ్లు టీ తాగి వెళ్లమని బతిమాలారని పేర్కొంది.