నేటికాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగి పోయింది. దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఈ సెల్ ఫోన్లతో సెల్ఫీలు దిగే వాళ్లు ఎక్కవయ్యారు. అది కూడా ప్రమాదాన్ని లెక్క చేయకుండా సెల్ఫీల కోసం తాపత్రయపడుతున్నారు. కొందరు ఉదయం లేచినది మొదలు..రాత్రి పడుకునే వరకు సెల్ఫీల్లో మునిగి తేలుతుంటారు. సెల్ఫీలు దిగి.. తమ సోషల్ మీడియాలో పెట్టుకుని గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతుంటారు. ఇలా.. రైలు వస్తున్న సమయంలో, ఎత్తైన జలపాతాల వద్ద, ఇతర ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఫోటోలు దిగేందు కూడా వెనుకాడటం లేదు. ఇలా సెల్ఫీల మోజులో పడి ఎందరో మృతువాత పడ్డారు. తాజాగా పెళ్లి కాబోయే ఓ జంట కూడా సెల్ఫీ పిచ్చితో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. ఫోటోలు దిగే ప్రయత్నంలో 120 అడుగుల లోతైన క్వారీలో పడిపోయారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కొన్ని రోజుల్లో జరగాల్సిన వారి పెళ్లి వాయిదా పడింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్ కు .. కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన శాండ్రా ఎస్. కుమార్ కు కొన్ని రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. డిసెంబర్ 9న వీరి వివాహం ఘనంగా జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు. పెళ్లి వేడుకలో భాగంగా గురువారం ఉదయం కాబోయే వధూవరులు ఇద్దరు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ పూజలు చేసి.. దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం దగ్గర్లో ఉన్న క్వారీని చూడడానికి కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. అయితే అదే సమయంలో కాబోయే వధువరులు సెల్ఫీ కోసం క్వారీ అంచుకు వెళ్లారు. ఫోటో దిగుతున్న క్రమంలో శాండ్రా కాలు జారి ఒక్కసారిగా 120 అడుగుల లోతు ఉన్న ఆ క్వారీ లోయలో పడిపోయింది.
క్షణం ఆలోచించకుండా వరుడు కృష్ణన్ సైతం ఆమెను కాపాడడానికి ఆ లోయలోకి దూకేశాడు. అప్పటికే నీటిలో మునిగిపోతున్న శాండ్రను.. కృష్ణ కాపాడి ఒక బండపై కూర్చోబెట్టాడు. ఈ ప్రమాదాన్ని చూసిన ఓ వ్యక్తి.. స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే పోలీసులు, ఇతర రెస్క్యూ సిబ్బంది వచ్చి వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో కాబోయే వధూవరులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే కొల్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఈ ప్రమాదం కారణంగా శుక్రవారం జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. హాయిగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ సెల్ఫీ పిచ్చితో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారని స్థానికులు అంటున్నారు.