సాధారణంగా మాంసం అంటే ఇష్టం ఉండని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు.. మటన్, చికెన్, చేపల దుకాణాల దగ్గర జనం బారులు తీరుతారు. రకరకాల మసాలాలతో మాంసం వండితే ఇక ఓ పట్టు పట్టేస్తుంటారు. అయితే మీరు ఎవరైన పచ్చి మాంసం తింటారా?. ఎవరినైనా అడిగితే.. ఏంటి ఈ ప్రశ్న అంటారు. ఎవరైన పచ్చి మాంసం ఎలా తింటారు అని ఎదురు కోపగించుకుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం పచ్చి మాంసమే తింటుంటాడు. పచ్చి కోడినే భక్షిస్తుంటాడు. అలా 20ఏళ్లుగా పచ్చి మాంసం తింటూ జీవనం సాగిస్తున్నాడు. మరి.. ఆ వ్యక్తి ఎవరు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలోని జురియా పట్నాలో 25 ఏళ్ల సంతోష్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాళ్లపై శిల్పాలు తీర్చిదిద్దుతూ ఉపాధి పొందుతుంటాడు సంతోష్ కుమార్. అయితే ఇతను ఆహారంగా అన్నం అతి తక్కువగా తీసుకుంటాడు. మాంసం మాత్రం ఓ రేంజ్ లో ఆరగిస్తుంటాడు. రోజుకు రెండు కోళ్లను వండకుండానే ఆరగిస్తాడు. పొలాలు, కాలువల వద్ద పీతలు, చేపలను పట్టుకుని అమాంతం మింగేస్తాడు. బాల్యం నుంచి పచ్చి మాంసం, చేపలు తినడం అలవాటని, నేటికీ అదే పద్ధతి కొనసాగిస్తున్నానని సంతోష్ తెలిపాడు. ప్రాణాంతో ఉన్న చేపలు, పీతలను టమాట సాస్ లో ముంచుకొని భుజిస్తానని పేర్కొన్నాడు. మరి. పచ్చి మాంసం ఆరగిస్తున్న ఈ వ్యక్తి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.