గౌతమ్ అదానీ ఓ వ్యాపారవేత్త. అతని గురించి మీడియాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. కుబేరుల జాబితాలో అదానీ ఒకరు. మహారాష్ట్రలో అదానీకి చెందిన ఎలక్ట్రిసిటీకి దొంగలు భారీగా షాకిచ్చారు.
ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. ఎంత రద్దీ ప్రదేశాల్లోనైనా వారి పని వారు కానిచ్చేస్తారు. పెద్దపెద్ద దొంగతనాలు చేసి భారీగా నగదుతో పట్టుబడినవారు చాలామంది ఉన్నారు. లగ్జరీ లైఫ్కు అలవాటు పడి చాలామంది ఈజీ మనీ కోసం ఎంతటి దారుణానికైనా తలపడుతున్నారు. ప్రభుత్వం వారిపట్ల కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ జరగవలసిన దారుణాలు జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ భారీ దొంగతనం చోటు చేసుకుంది. దుండగులు ఏకంగా అదానీ సంస్థకు చెందిన ఓ వంతెనను దొంగిలించారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. జరిగింది మాత్రం అదే. ఏకంగా వంతెనను దొంగిలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో అదానీ ఎలక్ట్రిసిటీకి చెందిన ఓ బ్రిడ్జినే ఎత్తుకెళ్లారు. ఎప్పుడు రద్దీగా ఉండే మార్గంలో బ్రిడ్జిని ఎలా కాజేసారని స్థానికులు, పోలీసులు, అదానీ ఎలక్ట్రిసిటీ యాజమాన్యం నోరెళ్లబెట్టే పరిస్థితి నెలకొంది. మలాడ్ ప్రాంతంలో 2022 జూన్ నెలలో అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థ ఇనుప వంతెన నిర్మించింది. ఆ సంస్థకు సంబంధించిన ఎలక్ట్రిక్ వైర్లను తరలించేందుకు తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలువపై మరో వంతెన నిర్మితమైంది. కొత్త బ్రిడ్జి వాడుకలో ఉండగా అదానీ సంస్థ నిర్మించిన బ్రిడ్జి వినియోగం తగ్గింది. ఇది కాస్త దుండగులకు అనుకూలంగా మారింది. సుమారు 6 వేల కిలోల బరువున్న ఈ వంతెన మాయం అయింది. ఎప్పుడూ జనాలు, వెహికిల్స్తో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ భారీ దొంగతనం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
వంతెన దొంగిలించబడిన తర్వాత అదానీ సంస్థ యాజమాన్యం స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్న తర్వాత అధికారులు నెత్తికి చేతులు పెట్టుకుని నోరెళ్లబెట్టారు. గ్యాస్ కట్టర్ల ద్వారా వంతెనను ముక్కలుగా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కట్ చేసిన ముక్కలను పెద్ద ట్రక్కులో ఎక్కించి తరలించారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అందులో ఒకరు బ్రిడ్జి నిర్మాణం సమయంలో అదానీ సంస్థలో కాంట్రాక్ట్ పద్దతిన పని చేశాడని పోలీసులు వెల్లడించారు. మిగతా ముగ్గురు అతనికి సహాయం చేసి ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లారని వెల్లడించారు. పోలీసులు దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నారు.