గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా స్పందించారు. నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ సీదీ జిల్లాలో జరిగిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని అధికార యంత్రాంగం అంటుంది. ఓ గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ పోలీసుల వరకు వెళ్లింది. ఇప్పటికే పోలీసులు నిందితుడు ప్రవేశ్ శుక్లాని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ ఘటనను రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సిగ్ చౌహాన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నిందితుని ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు.
మధ్యప్రదేశ్లోని సీదీ జిల్లాలోని కుబ్రి గ్రామంలో నిందితుడు ప్రవేశ్ శుక్ల ఇల్లు ఉంది. పై అధికారులు ఇచ్చిన ఆదేశం ప్రకారం బుల్డోజర్ తీసుకుని బుధవారం ఇంటి దగ్గరికి చేరుకున్నారు. ఇంటిని బుల్డోజర్ తో కూల్చేశారు. ఇల్లు కూల్చివేసే సమయంలో ప్రవేశ్ శుక్లా కుటుంబసభ్యులు అధికారులను ఇల్లు కూల్చొద్దని చాలా వేడుకున్నారు. అయినా పై అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇల్లు నేలమట్టం చేశారు. గిరిజన యువకుడిపై అమానుషంగా మూత్ర విసర్జన చేస్తూ.. సిగరెట్ కాల్చుకుంటూ సైకోలా ప్రవర్తిస్తున్న వీడియో మంగళవారం వైరల్ అయింది. ఈ విషయంలో ప్రవేశ్ శుక్లాని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతనిపై జాతీయ భద్రతా చట్టం-ఎన్ఎస్ఏ కింద కేసు బుక్ చేశారు. ప్రవేశ్ శుక్లాను రేవా సెంట్రల్ జైలులో ఉంచారు.
ప్రవేశ్ శుక్లా ఇంటిని కూల్చేందుకు అధికారులు వెళ్లగా.. నిందితుని కుటుంబసభ్యులు అధికారులను తమకున్నది ఒకే చిన్న ఇల్లు అని.. అదికూడా కూల్చేస్తే తాము నివసించడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని వేడుకున్నారు. ఈ కేసులో తమ కుమారుడిని అనవసరంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని నిందితుని తల్లిదండ్రులు తెపిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గతంలోనిదని.. కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో దీన్ని సోషల్ మీడియాలోకి వదిలారని వారు తెలిపారు. రాజకీయ లబ్ధికోసం కొందరు వీడియో వైరల్ చేశారని నిందితుని సోదరి తెలిపింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శిరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా అన్నారు. నిందితుడు తాగిన మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. వీడియో వైరల్ అవుతుంటే నెటిజన్లు, ప్రతిపక్షాలు, గిరిజన సంఘాలు శివరాజ్ సింగ్ చౌహాన్పై, బీజేపీ సర్కార్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. దీంతో సీఎం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జరీ చేశారు.