బోరు బావులను పూడ్చకుండా అంసపూర్తిగా వదిలేస్తే.. అవి చిన్నారుల పాలిట మృత్యుకుహారాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం, అధికారులు దీని గురించి ఎంత హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఇలాంటి ప్రమాదాల్లో చిన్నారులు ప్రాణాలను కోల్పోయిన ఘటనలు చాలా జరుగుతున్నాయి.
సాధారణంగా నీటి సౌకర్యం కోసం బోర్లు వేస్తుంటారు. పొలాల దగ్గర, ఇంటిపరిసరాల్లో బోరుబావులను పూడ్చకుండా వదిలేయడంతో అవి చిన్నపిల్లల పాలిట మృత్యుకుహారాలుగా మారుతున్నాయి. బోరు బావిలో చిన్నారులు పడిన ఘటనలు ఎన్నో జరిగినా పట్టించుకోవడం లేదు. అధికారులు, పోలీసులు హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోతుంది. వాటి గురించి తెలియకుండా చిన్నారులు ప్రమాదవశాత్తు బోరుబావుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటువంటి ప్రమాదాల్లో పిల్లల ప్రాణాలు కోల్పోయిన ఘటనలే ఎక్కువగా జరిగాయి. తాజాగా బీహార్లో ఆదివారం బోరుబావిలో అయిదేళ్ల బాలుడు పడ్డాడు. అధికారులు, సహాయక బృందాలు బాలున్ని ప్రాణాలతో కాపాడగలిగారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం…
బీహార్లోని నలంద జిల్లాలో ఆదివారం బోరుబావిలో ఐదేళ్ల బాలుడు పడ్డాడు. తన స్నేహితులతో ఆడుకుంటూ శివమ్ కుమార్ ప్రమాదవశాత్తు 50 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. దీంతో సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టాయి. జేసీబీ యంత్రంతో బోరుబావిని సమాంతరంగా తవ్వకాలు చేపట్టాయి. 50 అడుగుల లోతులో ఉన్న బాలునికి ఆక్సిజన్ అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 8 గంటల అనంతరం అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. ఆ చిన్నారిని ప్రాణాలతో బయటికి తీశారు. బాలుడు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. బాలున్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చివరకు ఆ బాలుడు మృత్యువును జయించాడు.