ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అన్న సామెత గుర్తుంది కదా.. మనిషి డబ్బు ఉంటే లోకం ఒకలా చూస్తుందే.. అదే డబ్బు కోల్పోతే మరోలా చూస్తుంది.
ప్రతి ఒక్కరికీ జీవితంలో కోటీశ్వరులు కావాలని కోరిక ఉంటుంది.. అదృష్టం తలుపు తడితే ఆ కల నెరవేరుతుంది. కొంతమంది ఎంత కృషి చేసినా.. కష్టపడినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. ఎలాంటి కష్టం పడకుండా షార్ట్ టైమ్ లో కోటీశ్వరులు అయినవారు ఉన్నారు.. కానీ ఆ సంపద ఎంతకాలం నిలుస్తుందనేది వారి జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది. భారత టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాపులర్ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ . బిగ్ బీ అమితా బచ్చన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షో ద్వారా కొంతమంది కోట్లు సంపాదించిన వారు ఉన్నారు. కేబీసీతో రూ.5 కోట్లు సంపాదించిన ఓ వ్యక్తి అనతికాలంలోనే దివాలా తీసే పరిస్థితికొచ్చి.. ప్రస్తుతం పాలు అమ్ముకుంటున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి.. అంత డబ్బు ఏమైంది అన్న విషయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితా బచ్చన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ హాట్ సీట్ పై కూర్చున్న తర్వాత వారిని నవ్విస్తూ.. మాటల గారడీ చేస్తూ, కష్టమైన ప్రశ్నలు సందిస్తూ.. లాక్ కియా జాయ్ అంటూ అమితా బచ్చన్ చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఈ షో ద్వారా కోటీశ్వరు కావాలని ఆశతో వచ్చిన వారు తమ కలలను నెరవేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ అనతి కాలంలోనే దివాలా తీసి గెల్చుకున్న డబ్బు మొత్తం పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బీహార్ కి చెందిన సుశీల్ కుమార్ ఒకరు.
2011 లో ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో పాల్గొన్న సుశీల్ కుమార్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఈ షోలో ఏకంగా రూ.5 కోట్లు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకున్నాడు. అంతకు ముందు సాదాసీదా జీవితాన్ని గడిపిన సుశీల్ ఒకేసారి అంత డబ్బు రావడంతో ఆయన లైప్ స్టైల్ మొత్తం మారిపోయింది. కేబీసీ తో వచ్చిన 5 కోట్లతో పాటు.. అతనికి స్నేహితులు.. కొత్త బంధువులు బాగా పెరిగిపోయారు. కేబీసీలో తన లాటెంట్ తో కోట్ల మంది ప్రశంసలు పొందిన సుశీల్ కుమార్ బాగా పాపులర్ కావడంతో స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అతన్ని బాగా ప్రోత్సహించాయి. మొత్తానికి సొసైటీలో అతన్ని ఒక సెలబ్రెటీని చేశారు. దీంతో వెనుకా ముందు అలోచించకుండా డబ్బు ఖర్చుచేయడం.. విరాళాలు ఇస్తూ టీవీ, పేపర్లలో తన పేరును గొప్పగా చెబుతుంటే పొంగిపోతూ వచ్చాడు.
ఒకప్పుడు సాదా సీదా జీవితాన్ని గడిపి సుశీల్ కుమార్ లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాడు.. ఫ్రెండ్స్ తో కొత్త అలవాట్లు పుట్టుకొచ్చాయి. మొత్తానికి నాలుగేళ్లలో 5 కోట్లు ఖర్చయిపోయాయి. అతని ప్రవర్తనకు విసుగెత్తిన భార్య వదిలి వెళ్లిపోయింది. సుశీల్ కుమార్ వద్ద డబ్బు లేకపోవడంతో స్నేహితులు, బంధువులు, స్వచ్చంధ సంస్థలు దగ్గరకు కూడా రాలేదు. సుశీల్ కుమార్ వద్ద డబ్బు లేకపోవడంతో చిన్న చూపు చూసింది సమాజం. తన జీవితంలో చేసిన తప్పులు తల్చుకుంటూ బాధపడ్డాడు.. భార్య లేదు.. డబ్బు లేదు… ఇక జీవితం ఎందుకు అని డిప్రేషన్ లోకి వెళ్లిపోయాడు.. అదే సమయంలో కొంతమంది ఆత్మీయ స్నేహితులు జీవితాన్ని వేరే విధంగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో బతుకుదెరువు కోసం రెండు గేదెలు కొని పాలు అమ్మడం మొదలు పెట్టాడు. అతని టాలెంట్ గుర్తుంచుకున్న ఓ స్కూల్ యాజమాన్యం అతనికి టీచర్ ఉద్యోగం ఇచ్చింది. అలా ఉద్యోగం చేస్తూ.. పాలు అమ్ముతూ.. పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టాడు సుశీల్ కుమార్. డబ్బు ఉంటే సొసైటీలో ఎలాంటి గౌరవం ఉంటుంది.. లేకుండే ఎలాంటి ఛీత్కారలు ఉంటాయి అన్నదానికి ఉదాహరణ తన జీవితం అంటూ పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశాడు సుశీల్ కుమార్.