వైద్య విద్యనభ్యసించి తమ కొడుకు డాక్టర్ గా రాణించాలని కలలుకన్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. నీట్ ఎగ్జామ్ ఆ విద్యార్థి పాలిట శాపమైంది. దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు ఉన్నత చదువులు చదవాలని కోరుకుంటారు. జీవితంలో బాగా చదువుకుని ఉన్నతమైన స్థితిలో స్థిరపడాలని ఆకాంక్షిస్తుంటారు. పిల్లలకు మంచి విద్యనందించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు తల్లిదండ్రులు. పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని తమ కలలను నెరవేరుస్తారని గంపెడాశలు పెట్టుకుంటారు. ఇదే విధంగా ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ కొడుకు డాక్టర్ అవ్వాలని కలలు కన్నారు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థి నీట్ ఎగ్జామ్ కు హాజరయ్యాడు. కానీ ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
తమిళనాడుకు చెందిన జగదీశ్వరన్ అనే విద్యార్థి నీట్ పరీక్షను తప్పాననే బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు సార్లు నీట్ పరీక్షలో ఫెయిల్ అవడంతో ఈ దారుణ నిర్ణయానికి పూనుకున్నాడు. ఇది జీర్ణించుకోలేని అతడి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రీకొడుకుల మరణంతో కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనతో తమిళనాడులో నీట్ పరీక్ష చర్చకు దారితీసింది. ఇక ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ స్పందించారు.
తండ్రీకొడుకుల మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం స్టాలిన్.. నీట్లో పరీక్షలో ఉత్తీర్ణత కాకపోతే అభ్యర్థులెవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మంచి జీవితం ఉంటుందని.. ఆత్మవిశ్వాసంతో ఉండాలని విద్యార్థులకు సూచించారు. మరికొద్ది నెలల్లో రాజకీయ మార్పులు చోటుచేసుకుంటే.. నీట్ అడ్డంకులు తొలగిపోతాయని స్టాలిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డుగా మారిన నీట్ రద్దు అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం స్టాలిన్ వెల్లడించారు. కాగా తమిళనాడు విద్యార్థులకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్తో అసెంబ్లీ చేసిన మొదటి తీర్మానాన్ని.. గవర్నర్ తిప్పి పంపిన విషయం తెలిసిందే.