మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయో ఊహించడం, అంచనా వేయడం కష్టం. ముందు జాగ్రత్తలు పాటించి కొన్ని రకాల ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ ప్రకృతి విపత్తుల వంటి వాటి నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఇక మరి కొన్ని ప్రమాదాలను చూస్తే.. వామ్మో.. ఇలా కూడా జరుగుతుందా అనిపించక మానదు. ఇప్పుడు మనం చదవబోయే సంఘటన కూడా ఈ కోవకు చెందినదే. స్నానం చేయడానికని చెప్పి.. ఓ వ్యక్తి నదిలోకి దిగాడు. స్నానం చేస్తుండగా.. అనుకోని విధంగా ప్రమాదానికి గురయ్యాడు. నదిలో స్నానం చేస్తూ ఏమరపాటుగా ఉన్న అతడిని ప్రమాదం మొసలి రూపంలో పలకరించింది. అతడిపై దాడి చేసి నదిలోకి లాక్కెళ్లిపోయింది మొసలి. ఈ విషాదకర సంఘటన రాజస్తాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
రాజస్థాన్లోని ఖటోలి పట్టణానికి చెందిన బిల్లూ అనే వ్యక్తి స్నానం చేయడం కోసం పక్కనే ఉన్న పార్తి నదిలో రామ్ఘాట్ వద్దకు వెళ్లాడు. నదిలో దిగి స్నానం చేస్తుండగా.. ఉన్నట్లుండి అక్కడ మొసలి ప్రత్యక్షం అయ్యి.. అతడిపై దాడి చేసింది. నదిలోకి లాక్కెళ్లింది. ఆ సమయంలో బిల్లూతో పాటు నదిలో స్నానానికి దిగిన వ్యక్తులు.. షాక్లో చూస్తూ ఉండిపోయారు. తేరుకుని సాయం కోసం హహకారాలు చేశారు. కానీ ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బిల్లూ నదిలోకి వెళ్లిపోయాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు బిల్లూ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కోట నుంచి ఎస్డీఆర్ఎఫ్ బృందం సహకరించాలని స్థానిక అధికారులు కోరారు. ఇటీవల యూపీలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. చెరువులో స్నానానికి దిగిన ఓ చిన్నారిని మొసలి అమాంతం పట్టుకుని బలి తీసుకుంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.