మోడల్, నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు అందాయి. అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్లలో అప్లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాను కూడా విచారించనున్నారు. ఈ మేరకు ముంబయి క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ పోలీసులు ఆమెకు సమన్లు పంపారు. ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.
మరోవైపు రాజ్కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ముంబయి పోలీసులు సీజ్ చేస్తున్నారు. కాన్పూర్లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా శాఖలో రాజ్కుంద్రా, శిల్పాశెట్టిలకు ఉన్న ఖాతాలను స్తంభింపచేయాలని ఎస్బీఐకి సూచించారు. తాము 20-25 నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్స్ చేసినట్లు ఈ కేసుతో సంబంధం ఉన్న దర్శకుడు తన్వీర్ హష్మి ఒప్పుకొన్నారు. రాజ్కుంద్రా అశ్లీల చిత్రాల కేసు నేపథ్యంలో పలువురి పేర్లు బయటకు వస్తుండటంతో ఎవరికి వారు తమ స్పందన తెలియజేస్తున్నారు.
పోర్న్ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్ షాట్స్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి తొలగించడంతో కుంద్రా ప్లాన్-బీని అమలు చేసినట్లు తెలుస్తోంది. బాలీఫేమ్ పేరుతో మరో యాప్ను ఏర్పాటు చేసి దందాను కొనసాగించారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే ఇందులో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది. పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్ ఠాకుర్ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో స్నేహ సంబంధాలను ఏర్పర్చుకున్నాడు.
అవార్డులు గెలుచుకున్న లఘు చిత్రాలను ప్రసారం చేసేందుకు యాప్ను ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించాడు. దీంతో ఆ అధికారి తన భార్య పేరు మీద బాలీఫేమ్ యాప్ను రిజిస్టర్ చేశాడు. అయితే ఆ యాప్లో అశ్లీల చిత్రాలను అప్లోడ్ చేయడంతో అతడు అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. ఈ క్రమంలో నటి ఫ్లోరా సైనీ స్పందించారు. అలాగే ఇంకో వ్యాపారి కూడా స్పందించాడు.
ఓ ఆన్లైన్ క్రికెట్ గేమ్కు డిస్ట్రిబ్యూటర్గా నియమిస్తానని హామీ ఇచ్చి రూ.3 లక్షల మేరకు మోసం చేశారంటూ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ సంస్థపై ముంబయి పోలీసులకు ఆ వ్యాపారి ఫిర్యాదు చేశారు. తనలాగే చాలా మందిని రూ.కోట్ల మేరకు మోసగించారని పేర్కొన్నారు.