సాంకేతికత పెరిగి.. అంతరిక్షంలోకి వెళ్తున్న నేటి కాలంలో కూడా.. ఆడామగా తేడాలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. నేటి కాలంలో కూడా ఆడపిల్లలు వద్దునుకునే తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. చట్టాలు కఠినతరం అయినప్పటికి.. కొందరు మాత్రం.. గర్భంలో ఉన్న శిశువు.. ఆడపిల్లని తెలిస్తే.. అబార్షన్ చేయిస్తున్నారు. ఎందుకంటే.. ఆడపిల్ల అయితే.. పెంచి పెద్ద చేసి.. కట్నకానుకలు ఇచ్చి.. అత్తారింటికి పంపాలి.. అదే పెద్ద ఖర్చు.. అందుకే అసలు ఆడపిల్లను కనకుండా ఉంటే.. ఏ బాధ ఉండదు కదా అనుకునేవారు నేటికి కూడా ఉన్నారు. ఆడపిల్ల అంటే అదనపు ఖర్చు అని భావించే.. నేటి రోజుల్లో ఓ తండ్రి.. కుమార్తె పుట్టిందని తెలిసి.. స్వయంగా మహాలక్ష్మినే తన ఇంట పుట్టిందని సంబరపడ్డాడు. చిట్టితల్లిని.. రథం మీద ఊరేగింపుగా తన ఇంటికి తీసుకెళ్లి.. ఘనంగా ఆహ్వానించాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో చోటుచేసుకుంది. నగరానికి చెందిన సాగర్, జాన్వి దంపతులకు మూడు రోజుల క్రితం కుమార్తె జన్మించింది. ఈ వార్త తెలిసి.. సాగర్ ఎంతో సంతోషించాడు. తన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని ఎంతో సంబరపడిపోయాడు. వెంటనే ఇంటికి కాల్ చేసి.. తనకు కుమార్తె పుట్టిందని.. చిట్టితల్లిని ఆహ్వానించడానికి ఘనంగా ఏర్పాట్లు చేయమని చెప్పాడు. ఈ వార్త విన్న సాగర్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. ఇక చిన్నారిని ఇంటికి తీసుకెళ్లడానికి.. ఏకంగా రథం ఏర్పాటు చేశాడు. తల్లీబిడ్డలను ఆస్పత్రి నుంచి రథం మీద ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లాడు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లే దారంతా పూలు చల్లుతూ.. మేళతాళలతో భార్యాబిడ్డలను ఊరేగిస్తూ.. ఇంటికి తీసుకెళ్లాడు.
‘‘ఆడపిల్ల అంటే నాకు ఎంతో ఇష్టం. స్వయంగా మహాలక్ష్మి నా ఇంట అడుగుపెట్టినంత సంతోషంగా ఉంది. ఆడపిల్ల కుటుంబంలో సంతోషం నింపుతుంది. ఆమెను పిండంగా ఉండగానే చంపాలని చూడకూడదు. ఆడపిల్లను భారంగా భావించకూడదు. తగినంత ప్రోత్సాహిస్తే.. వారు తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాక.. మనకు అండగా ఉంటారు. నేటి కాలంలో కూడా ఆడపిల్ల పుట్టిందన్న నిరాశతో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. అది నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. సంతానం అంటే.. భగవంతుడు మనకు ఇచ్చిన వరం.. కాబట్టి ఆడా, మగా అనే తేడా లేకుండా సంతోషించాలి. నాకు కూతురు పుట్టిందన్న వార్త తెలియగానే మా కుటుంబ సభ్యులతో చర్చించి, ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశాను’’ అని ఆనందం వ్యక్తం చేశాడు.
ఇక సాగర్ తల్లిదండ్రులు కూడా తమకు మనవరాలు పుట్టిందని ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘ఆడ, మగ అని వివక్షత చూపకూడదు. ఎవరైనా ఒకటే. కానీ, సమాజంలోని కొందరు తమ ఇంట్లో ఆడపిల్ల పుడితే విచారం వ్యక్తం చేయడం బాధాకరం.. ఈ ఆలోచనా విధానం మారాలి’’ అని అన్నారు. ఆడపిల్ల వద్దనుకుంటున్న నేటి కాలంలో.. చిట్టితల్లిని ఇలా ఊరేగింపుగా తీసుకెళ్లిన సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.