కోట్లు చోరీ చేసి వేరే దేశం పారిపోవాలనుకుంది. అందుకోసం అన్నీ సిద్ధం చేసుకుంది. అయితే వెళ్లే ముందు చేసిన ఒక చిన్న తప్పు ఆమెను, ఆమె భర్తను పట్టించింది. ఆమె ఏం చేసిందంటే?
ధనవంతులు అవ్వాలని ఆశ.. కష్టపడకుండా సులువుగా సంపాదించేయాలన్న కోరిక ఏకమై దొంగతనానికి దారి తీసింది. ఓ యువతి భర్తతో కలిసి ఏకంగా రూ. 8.49 కోట్లను కాజేసింది. ఆ డబ్బుతో భర్తతో కలిసి నేపాల్ వెళ్లిపోవాలని ప్లాన్ వేసింది. అయితే ఒకే ఒక్క తప్పు ఈ కిలేడీని పట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని లుథియానాలో జూన్ 10వ తారీఖున ఒక దొంగతనం జరిగింది. న్యూ రాజ్ గురు నగర్ లో సీఎంఎస్ సెక్యూరిటీస్ కి చెందిన క్యాష్ వ్యాన్ ని దొంగిలించారు. మన్దీప్ కౌర్ అలియాస్ డాకు హసీనా లుథియానాలో జరిగిన 8.49 కోట్ల చోరీలో నిందితురాలిగా ఉంది. జూన్ 10న న్యూ రాజ్ గురు నగర్ ప్రాంతంలో ఉన్న సీఎంఎస్ సెక్యూరిటీస్ కంపెనీలో ఉన్న 5 గురు ఉద్యోగులను బంధించి భర్తతో కలిసి 8 కోట్ల 49 లక్షలను కాజేసింది.
ఈ డబ్బుతో భర్తతో కలిసి నేపాల్ వెళ్లిపోవాలని అనుకుంది. అయితే ఒకే ఒక్క తప్పుతో ఇద్దరూ అడ్డంగా దొరికిపోయారు. తప్పించుకున్న కిలేడీ కోసం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ ను నిర్వహించారు. ‘లెట్స్ క్యాచ్ ది క్వీన్ బీ’ పేరుతో పోలీసులు ఆపరేషన్ ను నిర్వహించి ఎట్టకేలకు దొంగ దంపతులను పట్టుకున్నారు. దొంగతనం చేసిన తర్వాత దంపతులిద్దరూ నేపాల్ పారిపోవాలని అనుకున్నారు. దీని కంటే ముందు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. హరిద్వార్, కేదార్ నాథ్, హేమకుంట్ సాహిబ్ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే ఈ సమాచారం పోలీసులకు అందడంతో పథకాన్ని రచించి మరీ వారిని సునాయాసంగా పట్టుకున్నారు.
పుణ్యక్షేత్రాల్లో అంటే భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇంతమందిలో వారిని గుర్తుపట్టడం కష్టమని చెప్పి.. పోలీసులు ఉచిత శీతల పానీయం సర్వీస్ ని నిర్వహించారు. ఉచితంగా ఇస్తున్నారు కదా అని దొంగ దంపతులిద్దరూ డ్రింక్ స్టాల్ దగ్గరకు వచ్చారు. ఇద్దరూ కూల్ డ్రింక్ తీసుకున్నారు. అయితే ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకు ముసుగు వేసుకున్నారు. అయితే తాగడం కోసం ముసుగు తీయాల్సి వచ్చింది. దీంతో పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు ఉండగా.. 9 మందిని అరెస్ట్ చేశారు.
మన్దీప్ కౌర్ ద్విచక్ర వాహనం నుంచి 12 లక్షలు, జస్విందర్ సింగ్ ఇంటి నుంచి 9 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ.. ఆమెకు ధనవంతురాలు కావాలన్న ఆశ ఉందని, ఆమెకు అప్పులు ఉన్నాయని, గతంలో ఇన్సూరెన్స్ ఏజెంట్ గా, లాయర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిందని విచారణలో గుర్తించామని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జస్విందర్ సింగ్ ని వివాహం చేసుకుందని వెల్లడించారు. ఆ విధంగా రూ. 10 డ్రింక్ 8 కోట్ల 49 లక్షలు కాజేసి విదేశానికి పారిపోవాలనుకున్న కిలేడీని, అతని భర్తను పట్టించింది.