మేఘాలయలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ మాజీ నేత చెరిష్స్టార్ఫీల్డ్ థాంగ్కీ మరణంతో.. హింసాత్మక ఘటనలు తలెత్తాయి. థాంగ్కీ మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. పలుచోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం అర్ధరాత్రి పెట్రోల్ బాంబులు విసిరారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ఆందోళనకారలు 3 వ మైలు ఎగువ షిల్లాంగ్లోని లైమర్లోని ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం వద్ద ఈ దాడికి పాల్పడ్డారు. రెండు మోలోటోవ్ కాక్టైల్ బాటిళ్లను సీఎం నివాసంపై విసిరారు. గమనించిన గార్డులు వెంటనే మంటలు ఆర్పేశారు. కాగా, ప్రస్తుతం సీఎం కాన్రాడ్ సంగ్మా తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. మేఘాలయలో జరుగుతున్న హింసాత్మక ఘటలనకు నైతిక బాధ్యతగా.. ఆ రాష్ట్ర హోంమంత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. హోం శాఖ నుంచి రిలీవ్ చేయాలంటూ సీఎంకు లేఖ రాశారు. ఇది ఈ కేసు విచారణ పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం తీసుకన్న న్యాయపరమైన చర్యగా నిలుస్తుందని అన్నారు.
అసలు ఘర్షణలు ఎక్కడ మొదలయ్యాయంటే.. 2018లో లొంగిపోయిన చెస్టర్ఫీల్డ్ థాంగ్కీకి.. ఈ నెల లైతుంఖ్రా వద్ద జరిగిన పేలుడులో థాంగీకి పాత్రపై ఆధారాలు లభించాయి. థాంగీకి ఇంట్లో మరిన్ని ఆధారాలు లభిస్తాయని భావించిన పోలీసులు ఆగస్టు 13న సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించే సమయంలో థాంగీకి తమపై కత్తిత దాడికి యత్నించారని పోలీసులు ఆరోపించారు. అతడిని ఎదుర్కొవడానికి జరిపిన కాల్పుల్లో థాంగ్కీ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై థాంగ్కీ కుటుంబ సభ్యులతో పాటు, మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. థాంగ్కీ అంత్యక్రియల్లో వందల మంది మద్దతుదారులు నల్ల జెండాలతో నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. హింసాత్మక ఘటనల దృష్ట్యా అధికారులు కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. అలాగే నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి.. 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు.
థాంగ్కీ మరణంపై మేఘాలయ సీఎం విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై స్పందించిందిన మేఘాలయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది.