సాధారణంగా చిన్న పిల్లలు ఏది పడితే అది తినడం.. వద్దని తల్లిదండ్రులు వారించడం చూస్తూనే ఉంటాం. కొంతమంది చిన్నతనంలో మట్టి పెళ్లలు, బలపాలు, చాక్ పీసులు తినే అలవాటు ఉన్నా.. పెద్ద అయ్యాక అవి మానేడం చూస్తుంటాం. మనం తినే ఆహారంలో చిన్న రాయి పంటికింద పడితే అల్లాడిపోతాం. అలాంటిది ఓ అవ్వ మాత్రం ఏకంగా 60 ఏళ్లుగా ఇసుకనే ఆహారంగా తీసుకుంటు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆమె అంతగా ఇసుక తింటున్నా ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉండటం.. చురుగ్గా పొలం పనులకు వెళ్లడం చూసి ఇదెక్కడి విడ్డూరం అని అనుకుంటున్నారు స్థానికులు.
వివరాల్లోకి వెళితే.. వారణాసి జిల్లా షోలాపుర్ ప్రాంతంలోని కఠారి గ్రామంలో నివసిస్తుంది కుష్మావతిదేవి (75). గత 60 ఏళ్లుగా ఆమె ఇసుక మూడు పూటలా ఆహారంగా తీసుకుంటుంది. ఇసుక మాత్రమే తింటున్న తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని ఆమె తెలిపింది. తన ఆరోగ్య రహస్యం ఇసుక తినడమేనని ఆమె చెబుతోంది. అయితే ఆ అవ్వకు ఇసుకు తినే అలవాటు ఎలా మొదలైందంటే.. 15 ఏళ్ళ వయసులో ఉన్నపుడు కుష్మావతిదేవి కి విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందట. ఆ సమయంలో వైద్యులు బూడిద తింటే నయం అవుతుందని చెప్పారట. అప్పట్లో కాస్త బూడిద తో పాటు ఇసుక తీసుకోవడం అలవాటైందట. క్రమంగా కుష్మావతిదేవి కి ఇసుక తినడం అలవాటుగా మారిపోయిందట. ఇసుక ని శుభ్రంగా కడిగిన తర్వాత తింటుందట.
కుష్మావతిదేవి కి ఇద్దరు కుమారులు.. వారికి ముగ్గురు బిడ్డలు ఉన్నారట. ఇసుక తినొద్దని కుష్మావతిదేవికి కుమారుడు, మనవలు, బంధువులు ఎంత చెప్పినా వినే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసిందట కుష్మావతిదేవి. ఆమెతో ఈ అలవాటును మాన్పించేందుకు వైద్యులను సంప్రదించాలని కుటుంబసభ్యులు కోరితే ససేమిరా అంటుందట. ఆమె ఇసుకను ఆహారంగా తీసుకోవడానికి మానసిక సమస్య కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు.
శరీరంలో జింక్, ఐరన్ లోపం ఉన్నవారు.. ఇలా ఇసుకను ఆహారంగా తీసుకుంటారని చెబుతున్నారు. తనను ఈ విషయంలో బాగా ఇబ్బంది పెడుతున్నారని కుటుంబానికి దూరంగా ఓ ఇంట్లో ఒంటరిగానే నివసిస్తుంది ఆ అవ్వ. ప్రస్తుతం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడం.. చక్కగా పొలం పనులు చూసుకుంటుందట కుష్మావతిదేవి. ఏది ఏమైనా 60 ఏళ్ల వయసులో ఇసుక తినడం పై రక రకాలుగా చర్చించుకుంటున్నారట స్థానికులు.