అదృష్టవంతులను ఎవరూ చెడపలేరు.. దురదృష్టవంతులను ఎవరూ బాగుపర్చలేరు అన్న సామత తెలిసిందే. ఓ రిక్షా కార్మికుడు చేసిన సేవకు ఓ వృద్ద మహిళ కోటి రూపాయాల ఆస్తిని ఇచ్చింది. ఈ మేరకు ఆస్తి పత్రాలను రిక్షా కార్మికుడికి అందించింది. ఈ సంఘటన కటక్ లో చోటు చేసుకుంది. మరి అంతడబ్బు ఆ రిక్షా కార్మికుడికి ఈ మహిళ ఎందుకు ఇచ్చిందీ అన్నదానికి పెద్ద కారణమే ఉంది.
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రంలోని కటక్ సమీపంలో సంబల్ పూర్ లోని సుతాహత్ క్రిస్టియన్ సాహిలో మినతి పట్నాయక్ (63) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. కూతురు కి ఘనంగా పెళ్లి చేయాలని భావించారు. కానీ భర్త అనారోగ్య కారణాలతో 2020లో చనిపోయాడు. కుమార్తెతో మినతీ నివాసం ఉంటోంది. 2021లో ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో కుమార్తెను కోల్పోయింది. ఒంటరిగా ఉంటున్న మినతికి ఆసరాగా ఉంటామని అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు దగ్గరయ్యారు. కానీ వారి ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది. తన వద్ద ఉన్న డబ్బు కోసమే లేని పోని ప్రేమలు చూపిస్తున్నారని అర్థం చేసుకుంది. ఇదే సమయంలో ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మినతి పట్నాయక్ ఇంటికి సమీపంలోనే రిక్షా కార్మికుడు నివసిస్తున్నాడు. 25 ఏళ్లుగా మినతి పట్నాయక్ కుటుంబానికి సామల్ కుటుంబం తోడుగా ఉంటుంది. అయితే తనకు ఇంతకాలం పాటు ఎలాంటి స్వార్ధం లేకుండా సేవ చేస్తున్న బుడ సామల్ కుటుంబానికి తన ఆస్తిని రాసివ్వాలని నిర్ణయం తీసుకొంది. రూ. కోటి విలువైన మూడంతస్తుల భవనం, ఇతర సామాగ్రీని రిక్షా కార్మికుడు కుటుంబానికి ధారాదత్తం చేస్తూ.. వీలునామా రాయించి.. రిజిస్ట్రేషన్ చేయించింది.
ఈ సందర్భంగా మినతి మాట్లాడుతూ.. తన కూతురిని చిన్నతనంలో స్కూల్ కు తీసుకెళ్లడంతో పాటు ప్రతి రోజూ కూరగాయలు, నిత్యావసర సరుకులు తెచ్చి ఇచ్చేవాడని ఆమె గుర్తు చేసుకొన్నారు. అంతేకాదు తన భర్త అనారోగ్యంగా ఉన్న సమయంలో బంధువులు, తోబుట్టువులు దగ్గర లేకున్నా రిక్షా కార్మికుడు సామల్ తన కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉన్నాడని తెలిపింది. సామేల్ కుటుంబ సభ్యులు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ గౌరవించారని చెప్పారు. అంతే కాదు తమ కుటుంబంలో ఎవరి ఏ ఇబ్బంది వచ్చినా కూడా జాగ్రత్తగా చూసుకొనేవారని మినతి పట్నాయక్ తెలిపారు.
ఇక రిక్షా కార్మికుడు సామెల్ మాట్లాడుతూ.. తాను ఏనాడూ కూడా ఆస్తి గురించి పట్టించుకోలేదని రిక్షా కార్మికుడు సామేల్ తెలిపారు. మినతి పట్నాయక్ భర్త చనిపోయిన తర్వాత తన కుటుంబంలో ఒక సభ్యురాలిని మినతిని చూసుకొన్నామన్నారు. ఆమె బతికే వరకు తాము ఆమెను చూసుకొంటామని సామేల్ తెలిపారు. ఇదిలా ఉంటే.. రిక్షా కార్మికుడు సామేల్ కుటుంబానికి ఆస్తిని రాసివ్వడాన్ని మినతి పట్నాయక్ సోదరీమణులు తీవ్రంగా వ్యతిరేకించారు.