ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలే లక్ష్యంగా ఉగ్ర దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందింది. ఇప్పటికే చాలా ఉగ్రవాద సంస్థలు అందుకు ప్రణాళికలు రచించినట్లు నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ప్రధాని మోదీ, మరికొందరు ప్రముఖ వ్యక్తులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు నిఘా సంస్థలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ మొత్తం ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నారు.
పాకిస్తాన్, అఫ్గాన్- పాక్ ప్రాంతాలకు చెందిన ఉగ్రమూకలు ఈ దాడులకు దిగే అవకాశం ఉందంటున్నారు. రద్దీ మార్గాలు, జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, ప్రధాన కట్టడాలపై డ్రోన్లతో దాడి కూడా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధాని సభను టార్గెట్ చేసుకునే ఉగ్రవాదులు దాడికి దిగుతారని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ది రెస్సిస్టెన్స్ ఫోర్స్, హిజ్బుల్ ముజాహిద్ వంటి ఉగ్రమూకలు ఇప్పటికే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఢిల్లీలోనే కాకుండా.. పంజాబ్, ఇతర ప్రధాన నగరాల్లోనూ ఈ దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం అందినట్లు తెలుస్తోంది.
గణతంత్ర వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా ఉగ్రవాదులు, వారి అనుచరుల, మద్దతుదారుల కోసం ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. మరోవైపు గణతంత్ర వేడుకలకు కరోనా ఎఫెక్ట్ కూడా తప్పేలా లేదు. ఈసారి కూడా సాదాసీదాగా వేడుకలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కేవలం 4 వేల మంది వీక్షకులకు మాత్రమే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. పరేడ్ లో 21 శకటాలు పాల్గొనున్నాయి. వేడుకల్లో కరోనా ఆంక్షలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్ లను అందుబాటులో ఉంచనున్నారు. కిర్గిస్థాన్, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తజకిస్థాన్ దేశాధినేతలు అతిథులుగా రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.