కేరళలో ఓ హిందూ జంట మసీదులో పెళ్లి చేసుకున్న ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఒక ముస్లిం జంట హిందూ ఆలయంలో వివాహం చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది.. వాళ్లు ఎందుకిలా చేశారంటే..!
దేశంలో హిందూ – ముస్లింల ఐక్యతను చాటిచెప్పే ఎన్నో ఘటనలు చూసుంటారు. కేరళకు చెందిన ఓ హిందూ జంట.. మసీదులో పెళ్లి చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మూడేళ్ల కింద జరిగిన ఈ ఘటనలో హిందూ జంట మసీదులో ఒక్కటవ్వగా.. తాజాగా ఓ ముస్లిం జంట హిందూ ఆలయంలో మ్యారేజ్ చేసుకుంది. హిందూ – ముస్లింల ఐక్యతను చాటిచెప్పేలా ఉన్న ఈ ఘటన హిమాచల్ప్రదేశ్లో చోటుచేసుకుంది. సిమ్లా జిల్లా, రామ్పూర్లోని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలోని ఠాకూర్ సత్యనారాయణ గుడిలో ఈ వివాహం జరిగింది. మౌల్వీ, సాక్షులు, లాయర్ సమక్షంలోనే ఈ మ్యారేజ్ జరిగింది. అంతేకాదు, ఈ వేడుకకు హిందువులు, ముస్లింలు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మతసామరస్యం, సౌభ్రాతృత్వ సందేశాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తన కుమారుడి పెళ్లిని ఆలయ ప్రాంగణంలో ప్లాన్ చేశానని వధువు తండ్రి మహేంద్ర సింగ్ మాలిక్ చెప్పారు. ఈ పెళ్లి ఏర్పాట్లకు విశ్వహిందూ పరిషత్, ఆలయ ట్రస్ట్ ఎంతో సహకరించాయని ఆయన అన్నారు. పరస్పర సౌభ్రాతృత్వం దెబ్బతినేలా ఒకరినొకరు తప్పుదోవ పట్టించుకోకూడదని మాలిక్ పేర్కొన్నారు. దీనిపై ఆలయ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ వినయ్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఆలయ నిర్వహణను విశ్వహిందూ పరిసత్ చూసుకుంటోందన్నారు. ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యాలయం కూడా ఇదేనన్నారు. సనాతన ధర్మం ఎల్లప్పుడూ అందరినీ కలుపుకుని ముందుకుపోయేలా ప్రేరేపిస్తుందని.. అందుకు ఈ పెళ్లి ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.