డబ్బు విలువ కష్టపడి సంపాదించే వారికే తెలుస్తుంది. అందుకే ప్రతి రూపాయను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఎవరైనా అన్యాయంగా తమ డబ్బును తీసుకుంటే కొందరు ఏమి చేయలేక వదిలేస్తారు. కానీ కొందరు మాత్రం వాటి కోసం పోరాడుతారు. అది రూపాయి అయినా కావోచ్చు. అలా తనకు రావాల్సిన ఒక రూపాయి అయినా సరే పొందాలి అనే కసి ఉన్న వ్యక్తి రూ.35 రీఫండ్ కోసం ఏకంగా ఐదేళ్లు పోరాటం చేశాడు. ఈ క్రమంలో ఆయన విజయం సాధించాడు. అతడు గెలవడమే కాకుండా మరో 3లక్షల మందికి లాభం చేకూర్చినవాడయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది. ఎందుకు అతను రూ.35 కోసం పోరాటం చేశాడు? ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
రాజస్థాన్ లో ని కోటకు చెందిన ఇంజనీర్ సుజీత్ స్వామి 2017 జులై 2వ తేదీ న గోల్డెన్ టెంపుల్ మెయిల్ ద్వారా దిల్లీ వెళ్లేందుకు అదే ఏడాది ఏప్రిల్ లో రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాడు. ఆ టికెట్ ధర రూ.765. అయితే కొన్ని కారణాలతో సుజీత్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. ఈ క్రమంలో టికెట్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు. దీంతో రీఫండ్ కింద రూ.665 జమ అయ్యింది. అయితే నిబంధనల ప్రకారం టికెట్ రద్దుకు రూ.65 క్లరికల్ ఛార్జీలు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా… రైల్వే మాత్రం రూ.35 సర్వీసు టాక్స్ తో కలుపుకుని రూ.100 కట్ చేసింది. అయితే టికెట్ రద్దు చేసుకునే సమయంలో జీఎస్ టీ అమల్లోకి రాలేదు.
ఇదీ చదవండి: చీమలు చేసిన పనితో.. బిహార్లో వెలుగులోకి బంగారు గని!కానీ ప్రయాణ తేదీ జీఎస్ టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఉందన్న కారణం చేత రూ.35 వసూలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సుజీత్.. లోక్ అదాలత్ సంప్రదించాడు. రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేశాడు. ఐఆర్ సీటీసీకి ఎన్నో సార్లు ఆర్ టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఐఆర్ సీటీసీ.. సర్వీస్ టాక్స్ ను రీఫండ్ చేసేందుకు అంగీకరించింది. అయితే 2019 మే1వ తేదీన రూ.33 మాత్రమే రీపండ్ చేసింది. అయినా సుజీత్ ఊరుకోలేదు. మిగిలిన రూ.2 కోసం మరో రెండేళ్లు పోరాటం చేశాడు.
అతని న్యాయపోరాటం ఫలించి గతవారం ఆ రెండు రూపాయాలను కూడా ఐఆర్ సీటీసీ ఆయన అకౌంట్ లో జమ చేసింది. అంతేకాదు, ఆయన పోరాటంతో మరో 3 లక్షల మంది కూడా లబ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్లు బుక్ చేసుకుని కేన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం మొత్తంగా రూ.2.43 కోట్లను రైల్వే రీఫండ్ చేయనుంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.