కుటుంబ సభ్యులు, బంధువులు ఎక్కువ సంఖ్యలో రైలు ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? మీ అందరి కోసం రైలు బోగీ లేదా రైలుని బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి.
సుదూర ప్రాంతాలకు బస్సులో వెళ్లడం కంటే రైలులో వెళ్తేనే ఖర్చు తక్కువ అవుతుంది. బస్సు టికెట్ ధరలతో పోలిస్తే రైలు టికెట్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే నాలుగైదు కుటుంబాలు కలిసి ఏ ఆధ్యాత్మిక యాత్రలకో, లేదా ఎవరిదైనా వివాహ వేడుకకో వెళ్లాలంటే బస్సులో వెళ్తుంటారు. బస్సులో వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ బస్సు కూడా లేకపోతే వెళ్లడం కష్టమవుతుంది. 30, 40 మంది కలిసి వెళ్లాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. రైలులో కలిసి ప్రయాణం చేద్దామంటే అందరికీ ఒకే చోట సీట్లు, బెర్త్ లు దొరకవు. పది మంది వరకూ అంటే కలిసి ఎలాగోలా కలిసి పక్కపక్కన రైల్లో ప్రయాణం చేయడం కుదురుతుంది కానీ పదుల సంఖ్యలో కలిసి ప్రయాణం చేయడం అంటేనే కష్టం. అలాంటి వారు కోచ్ ని బుక్ చేసుకోవచ్చు.
ఇంకా ఎక్కువ మంది ఉంటే కనుక మొత్తం రైలునే బుక్ చేసుకోవచ్చు. ఒక ఆర్టీసీ బస్సు లేదా ప్రైవేట్ బస్సుని బుక్ చేసుకున్నట్టే రైలుని లేదా ఒక బోగీని బుక్ చేసుకోవచ్చు. మొత్తం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి రైలు బోగీని బుక్ చేసుకోవచ్చు. ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఎలా బుక్ చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం. బోగీ లేదా రైలు మొత్తాన్ని బుక్ చేసుకోవడాన్ని ఫుల్ టారిఫ్ రేట్ (ఎఫ్టీఆర్) బుకింగ్ అని అంటారు. బోగీ లేదా రైలు మొత్తాన్ని బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ ఎఫ్టీఆర్ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత బోగీ లేదా రైలుని బుక్ చేసుకోవడానికి ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఎక్కాలనుకుంటున్న స్టేషన్, ఎక్కడికి వెళ్ళాలి? అనే వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. రైలు అందుబాటులో ఉంటే కనుక ఆన్ లైన్ లో అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ-2 టైర్, ఏసీ-3 టైర్, స్లీపర్ క్లాస్ ఇలా నచ్చిన బోగీని ఎంపిక చేసుకోవచ్చు.
ఏ స్టేషన్ నుంచి అయితే ప్రయాణం మొదలు పెడతారో ఆ స్టేషన్ మేనేజర్ కి ఒక్కో బోగీకి రూ. 50 వేల చొప్పున రిజిస్ట్రేషన్ కమ్ సెక్యూరిటీ ఛార్జీలు అంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి. లేదా చీఫ్ క్యాషియర్, సౌత్ సెంట్రల్ రైల్వే, సికింద్రాబాద్ క్యాష్ ఆఫీస్ కి డిమాండ్ డ్రాఫ్ట్ పంపించాల్సి ఉంటుంది.
ప్రత్యేక రైలు కావాలనుకుంటే కనీసం 18 బోగీలు బుక్ చేసుకోవచ్చు.
ప్రత్యేక రైలుని బుక్ చేసుకోవాలంటే కనుక కనీసం రూ. 9 లక్షలు రిజిస్ట్రేషన్ కమ్ సెక్యూరిటీ ఛార్జీలు చెల్లించాలి. ఈ సెక్యూరిటీ డిపాజిట్ ప్రయాణం పూర్తయ్యాక తిరిగి ఇస్తారు.
చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్ పోర్టేషన్ మేనేజర్ కి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బోగీ లేదా రైలుని 30 రోజుల ముందు లేదా 6 నెలల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అమౌంట్ రశీదుని అటాచ్ చేయాల్సి ఉంటుంది.
మీరు ప్రయాణం చేయాలనుకుంటున్న గమ్యస్థానానికి సంబంధించిన రైల్వేస్టేషన్ జోన్లలో భారీ వర్షాలు, పొగమంచు లేదని నిర్ధారణ అయితే అనుమతి లభిస్తుంది. అన్ని రకాలుగా ప్రయాణం బాగుందని గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రత్యేక రైలు లేదా బోగీలను బుక్ చేస్తారు.
ప్రయాణానికి 72 గంటలు (మూడు రోజుల ముందు) చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్ పోర్టేషన్ మేనేజర్ నుంచి ప్రయాణానికి సంబంధించి ఫైనల్ కన్ఫర్మ్డ్ ప్రోగ్రాం కాపీని తీసుకోవాలి.
ప్రయాణం ఏ స్టేషన్ నుంచి మొదలు పెడుతున్నారో ఆ స్టేషన్ లో కనీసం 48 గంటల ముందు ప్రయాణికులకు సంబంధించిన టికెట్లను పొందాలి.