ఇంటర్ చదివే కుర్రాడు మహిళల భద్రత కోసం ఎలక్ట్రిక్ చెప్పులు తయారు చేశాడు. కేవలం రూ. 500కే పోకిరీల తాట తీసేలా ఒక పరికరాన్ని కనిపెట్టాడు.
మహిళలు బయటకు వెళ్ళినప్పుడు వారికి భద్రత అనేది లేకుండా పోయింది. ఎప్పుడు ఎలా ఏ మూల నుంచి ఏ నీచుడు వస్తాడో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పోకిరీల ఆగడాలకు చెక్ పెట్టడానికి, లైంగిక వేధింపులకు గురి చేసే వారి తాట తీసే విధంగా ఓ ఇంటర్ కుర్రాడు ఎలక్ట్రిక్ చెప్పులను తయారు చేశాడు. సాధారణంగా ఎవరైనా మగాళ్లు మహిళల పట్ల దురుసుగా ప్రవర్టించినప్పుడు.. ‘చెప్పుతో కొడతా’ అని అంటారు. అయితే ఈ ఎలక్ట్రిక్ చెప్పులతో తన్నితే చాలు అదే కొడుతుంది. అదేనండి వారికి షాక్ కొడుతుంది. ఈఎలక్ట్రిక్ చెప్పులను కనిపెట్టింది ఝార్ఖండ్ లోని ఛత్రాకు చెందిన మంజీత్ కుమార్. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఉమెన్ సేఫ్టీ డివైజ్ పేరుతో మహిళలకు భద్రత కల్పించే ఎలక్ట్రిక్ చెప్పులను తయారు చేశాడు.
ఈ ఎలక్ట్రిక్ చెప్పులు వేసుకుని ఇతరుల సహాయం లేకుండా మహిళలు, బాలికలు పోకిరీల నుంచి తమను తాము కాపాడుకోగలుగుతారని మంజీత్ వెల్లడించాడు. ఈ చెప్పులతో పోకిరీలను తన్నితే కరెంట్ షాక్ తగిలి కింద పడిపోతారని చెప్పాడు. 2012లో నిర్భయ ఘటన జరిగినప్పుడు తనకు ఈ ఆలోచన వచ్చిందని, ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి ఇంటికి వచ్చేవరకూ తల్లిదండ్రులకు టెన్షన్ ఉంటుందని.. నిర్భయ వంటి ఘటన మళ్ళీ జరగకూడదనే తాను మహిళల రక్షణ కోసం ఎలక్ట్రిక్ చెప్పులను తయారుచేశానని వెల్లడించాడు. ఈ ఎలక్ట్రిక్ చెప్పులు అనేక మంది మహిళలకు ఆపద సమయంలో ఉపయోగపడితే చాలని.. అందుకోసం ప్రభుత్వ సహకారం కావాలని మంజీత్ కోరుతున్నాడు.
జత చెప్పులను తీసుకుని.. వాటి అడుగు భాగంలో నాలుగు బ్యాటరీలు, ఒక స్విచ్, ఇతర చిన్న పరికరాలను అమర్చి ఎలక్ట్రిక్ చెప్పులుగా మార్చాడు. దీనికి ఒక ఛార్జింగ్ పెట్టుకునేలా సీ టైప్ యూఎస్బీ పోర్ట్ ని అమర్చాడు. ఒక అరగంట ఛార్జింగ్ పెడితే రెండు రోజుల వరకూ పని చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ చెప్పులతో పోకిరీలను తన్నితే 220 నుంచి 300 వోల్టుల షాక్ తగులుతుందని మంజీత్ చెబుతున్నాడు. ఇక ఈ ఎలక్ట్రిక్ చెప్పులను తయారు చేయడానికి కేవలం రూ. 500 ఖర్చయ్యిందని వెల్లడించాడు. మరి ఇంటర్ చదువుతున్న కుర్రాడు ఆడవారి భద్రత కోసం ఎలక్ట్రిక్ చెప్పులను తయారు చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.