హిందూ, ముస్లింల ఐక్యతను చాటిచెప్పే ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. ముస్లింల ఆహ్వానం మేరకు ఓ మఠాధిపతి మసీదును ప్రారంభించారు. అన్ని మతాలు సమానమే, ఒకరికొకరు హాని తలపెట్టుకోకుండా సామరస్యంతో జీవించాలని తెలిపారు.
సర్వ మతాలకు పుట్టినిల్లైన భారతదేశంలో శాంతి, సామరస్యంతో ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్న భారత్ లో ఒకరిపై ఒకరు ఆదారపడుతూ తామంతా ఒక్కటే అని చాటిచెప్తున్నారు. కానీ కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం కలహాలు సృష్టించి ఘర్షనలకు తెరలేపుతున్నారు. విద్వేష మాటలతో, విద్వేష ప్రసంగాలతో మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటన మత సామరస్యానికి అద్దం పడుతుంది. తామంతా మనుషులమని, ఎవరు ఏ మతాన్ని పాటించినా మతాలకతీతంగా అందరం కలిసి ఉండటమే మానవధర్మమని చాటిచెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాల వారు కలిసి జీవిస్తున్న భారత్ లో కొంతమంది వ్యక్తులు మతాల మధ్య విద్వేషం కలుగజేసి గొడవలకు కారణమవుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ ఘటన ఆదర్శవంతంగా నిలిచింది. ముస్లింలు, హిందువుల మధ్య ఉన్న ఐక్యతను తెలిపే ఘట్టం ఆవిష్కృతమైంది. ఓ మఠాధిపతి మసీదును ప్రారంభించారు. స్వయంగా ముస్లింలే వెళ్లి స్వామీజీని ఆహ్వానించగా హిందూ మఠాధిపతి వెళ్లి మసీదును ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకాలోని కొప్పాల్ జిల్లాలోని భనపూర్ విలేజ్ లో ముస్లింలు నూతనంగా మసీదును నిర్మించుకున్నారు. ఈ మసీదును ప్రారంభించాల్సిందిగా గావి మఠానికి చెందిన అభినవ గావిసిద్ధేశ్వరస్వామిని ముస్లింలు స్వయంగా వెళ్లి ఆహ్వానించారు.
వారి ఆహ్వానాన్ని స్వీకరించిన సిద్దేశ్వర స్వామి మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ.. నిజమైన మతం ఎప్పుడూ సామరస్యాన్నే కోరుకుంటుందని, హిందూ, ముస్లింలు ఐక్యంగా జీవించాలని తెలిపారు. తమ మతమే గొప్పదని ఎవ్వరూ విర్రవీగకూడదని ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మానవత్వాన్ని చాటాలని వెల్లడించారు. ఏ మతం వారైనా ఇతరులకు హాని చేయకుండా జీవించాలని తెలిపారు. భనపూర్ గ్రామంలో ఐదు ముస్లిం కుటుంబాలే ఉన్నప్పటికి గ్రామస్థులతో కలిసి మెలసి జీవిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారని చెప్పారు.