ఐదేళ్లు పూర్తయ్యేసరికి ఒకటో తరగతి కంప్లీట్ చేస్తున్నారు నేటి కాలం పిల్లలు. అయితే కేంద్ర విద్యాశాఖ ఈ విధానానికి స్వస్తి పలికే యోచనలో ఉంది. ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలోకి ఎంట్రీ అంటుంది. ఆవివరాలు..
ఒకప్పుడు పిల్లలను ఐదేళ్లు నిండితేనే బడికి పంపేవారు. ఆ లోపు ఇళ్లల్లో ఉండే పెద్దవాల్లు, అమ్మనాన్నలు పిల్లలకు అవసరమైన విజ్ఞానాన్ని కథలు, పద్యాల రూపంలో నేర్పేవారు. అయితే నేటి కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పట్టుమని రెండేళ్లు కూడా నిండని పిల్లలను ప్లేస్కూల్ పేరిట బడికి పంపుతున్నారు. మూడేళ్లు వచ్చాయంటే.. ఇక ఆ చిన్నారులు బడిలో జాయిన్ కావాల్సిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ నూతప విద్యావిధానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఆలోచన చేస్తోంది. దీని ప్రకారం ఇకపై ఆరేళ్లు నిండిన పిల్లలకే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలను కోరింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖ రాసింది.
చిన్నారుల పునాది దశ విద్యాభ్యాసాన్ని మరింత బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ విద్యావిధానం-2020 సూచిస్తోంది అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ‘‘పునాది దశలో విద్యార్థులకు ఐదేళ్ల పాటు అభ్యాస అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. దానిలో మూడేళ్లు ప్రీస్కూల్ ఎడ్యుకేషన్, మరో రెండేళ్లు ప్రాథమిక విద్యలో తొలి దశ అయిన 1,2 తరగతులు ఉంటాయి. ప్రీస్కూల్ నుంచి రెండవ తరగతి వరకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సాహించాలన్నది ఈ విధాన ముఖ్య ఉద్దేశం’’ అని కేంద్రం లేఖలో వెల్లడించింది..
ఇది సాకారం కావాలంటే అంగన్వాడీలు, ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్, ఎన్జీఓలు నిర్వహించే ప్రీ స్కూల్ కేంద్రాల్లో మూడేళ్ల పాటు పిల్లలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెవాలి. ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆరేళ్లు నిండిన విద్యార్థులకు మాత్రమే ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించే దిశగా స్కూల్ అడ్మిషన్ ప్రక్రియలో సవరణలు చేయాలి’’ అని కేంద్రం లేఖలో సూచించింది.
అలానే ‘‘ప్రభుత్వం ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో నడిచే ప్రీ స్కూల్స్ విద్యార్థులకు ఆమేరకు తగిన విధంగా భోదించే టీచర్లను రెడీ చేసుకోవాడానికిగాను ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లోమా కోర్సును రూపొందించి అమలు చేయాలి. ఈ కోర్స్ను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా రూపొందించాలి. దీన్ని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ల ద్వారా అమలు చేయాలి’’ అని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలకు సూచించింది. మరి దీనిపై కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి. మరి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.