1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం మరోసారి భారత దేశంలో దాడులు నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ పేర్కొంది. ఇందు కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వెల్లడించింది. ఈసారి అతని బ్యాచ్ హిట్ లిస్ట్లో రాజకీయ నేతలు, ప్రముఖ వ్యాపారవేత్తల పేర్లు ఉన్నాయి. దావూద్ ఇబ్రహీం తన ప్రత్యేక విభాగంతో కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసను ప్రేరేపించే లక్ష్యంతో పేలుడు పదార్థాలు, మారణాయుధాలతో దేశంపై దాడికి ప్లాన్ చేస్తున్నాడని అధికారులు తెలిపారు.
ఇది చదవండి: అందంగా లేవంటూ భార్యను వేధించిన భర్త.. తట్టుకోలేని ఆమె
వివరాల్లోకెళ్తే.. ముంబై పేలుళ్ల సూత్రధారి, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం మరోసారి భారత్ను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, ఇది దేశంలోని ప్రముఖ వ్యక్తులకు ముప్పుగా పరిణమించిందని నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పేర్కొంది. భారత్ లోని ఆర్థిక రాజధాని ముంబయి, దేశ రాజధాని ఢిల్లీ, వంటి నగరాలపై దృష్టి సారించినట్టు పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశమందని సంబంధిత వర్గాలు అంచనాకు వచ్చినట్టు సమాచారం. కాగా టెర్రరిస్ట్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నట్టు ఆరోపిస్తూ ఇటీవల దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.
దావూద్ పై మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ తమ విచారణలో మరిన్ని కీలక విషయాలు తెలుసుకున్నట్టు అర్థమవుతోంది. దావూద్ మాఫియా లావాదేవీలు, అక్రమ ఆస్తుల వివరాలపై దృష్టి పెట్టి చాలా వరకూ సమాచారం తెలుసుకుంది. ఈ మేరకు గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) థానే జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. ఈ క్రమంలో విచారణ జరుపుతుండగా పేలుళ్ళకు సంబంధించిన కుట్రలు గురించి వెల్లడైనట్టు సమాచారం.