ఉద్యోగులకు ఆదాయం గురించిన ఆధారాలు సులువుగా లభిస్తాయి. వారి సాలరీ స్లిప్పు, ఫారం-16లు వారికి అవసరమైనప్పుడు ఆదాయ ధ్రువీ కరణలుగా ఉపయోగపడతాయి. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే అదే వారికి అధీకృత ఆదాయ ధ్రువీకరణగా మారుతుంది. వ్యక్తులకు రూ.2,50,000లోపు ఆదాయం ఉన్నప్పుడు రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు యాజమాన్యం ఫారం-16 అందిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి ఎలా?
అనేక సందర్భాల్లో వారికి ఇదే ఆదాయ ధ్రువీకరణగా పనికొస్తుంది. ఈ ఏర్పాటు లేని వారందరూ సొంతంగా ఐటీ రిటర్నులు దాఖలు చేసుకునేందుకు వీలుంటుంది. తామే సొంతంగా తమ ఆదాయాన్ని తెలియజేసి, ఆ మేరకు రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఒక వ్యక్తికి ఎంత ఆదాయం ఉంది, అతని పొదుపు, పెట్టుబడులు, ఖర్చుల గురించిన పూర్తి వివరాలను ఈ రిటర్నులు తెలియజేస్తాయి.
ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడి పథకాలపై వచ్చిన రాబడులకు పన్ను వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు రిటర్నులు దాఖలు చేయడం ఒక్కటే మార్గం. పన్ను వర్తించే ఆదాయం లేనప్పుడు వసూలు చేసిన మొత్తం పన్నును రిఫండ్ రూపంలో రాబట్టుకోవచ్చు.
ఒకవేళ ఆదాయం రూ.2,50,000 మించి ఉన్నప్పుడూ కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను వర్తించే ఆదాయం తగ్గిపోతుంది. పిల్లల ట్యూషన్ ఫీజులు, బీమా పాలసీలు ఉన్నప్పుడు వాటిని సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు.
సాధారణంగా రుణ దరఖాస్తు సమయంలో బ్యాంకులు కనీసం మూడేళ్ల ఐటీ రిటర్నులు అడుగుతుంటాయి. ఇవి ఉంటే మీకు రుణం వచ్చే అవకాశాలు ఎంతో మెరుగవుతాయి. కారు లేదా ఇల్లు కొనాలని అనుకుంటే లేదా వ్యక్తిగత రుణం కోసం చూస్తుంటే ఐటీఆర్ ఎంతో కీలకంగా మారుతుందని మర్చిపోకండి.క్రెడిట్ కార్డులు, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకునేందుకూ రిటర్నులు అవసరమే.
నిర్ణీత గడవులోపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారికి మూలధన నష్టాలను భవిష్యత్లో వచ్చే మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్ల లాంటివి నష్టాలకు విక్రయించినప్పుడు ఆ తర్వాత వచ్చే లాభాలతో వీటిని సర్దుబాటు చేసి, పన్ను భారం తగ్గించుకోవచ్చు.
వీసా ఇచ్చేందుకు కొన్ని దేశాలు ఆదాయపు పన్ను రిటర్నులు కోరుతున్నాయి. ఆదాయ, ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు దేశంలో పన్ను నిబంధనలు పాటిస్తున్న వ్యక్తిగానూ గుర్తిస్తాయి.