గూడ్స్ రైలు ఇంజిన్పై చిరుత దర్శనమిచ్చింది. దాని చూసిన అక్కడి వారు భయాందోళనకు గురయ్యారు. రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అటవీ అధికారులకు విషయం తెలుపగా..
రైలు ఇంజిన్పై చిరుత కళేబరం కలకలం రేపింది. గూడ్స్ రైలు ఇంజిన్ ముందు భాగంలో కళేబరం వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్ర, చంద్రపూర్ జిల్లాలో వనీ బొగ్గు గని క్షేత్రం ఉంది. ఇక్కడి నుంచి బొగ్గు గూడ్స్ రైలు ద్వారా సరఫరా అవుతుంటుంది. మంగళవారం అక్కడి గుగ్గూస్ రైల్వే సైడింగ్ వద్ద ఓ గూడ్స్ రైలు నిలిచి ఉంది. అక్కడే ఉన్న కొంతమంది రైలు ఇంజిన్పై ఓ చిరుత ఉండటం గమనించారు. అది బతికి ఉందని భావించిన వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయాన్ని స్థానిక రైల్వే అధికారి పోలీసులకు తెలిపారు. ఆ పోలీసులు చిరుత కనిపించిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దగ్గరకు వెళ్లి పరిశీలించగా అది చనిపోయి ఉన్నట్లు తెలియవచ్చింది. దీంతో చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం చంద్రపూర్కు తరలించారు. అసలు ఆ చిరుత రైలు ఇంజిన్పైకి ఎలా వచ్చింది? అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. చిరుత రైలు పైకి ఎక్కి ఉంటుందని, దిగబోయే ప్రయత్నంలో హైటెన్షన్ వైర్లు తగిలి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో చిరుత చావుకు గల కారణాలు తెలియరానున్నాయి. మరి, రైలు ఇంజిన్పై చిరుత కళేబరం దర్శనమివ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.