మహారాష్ట్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రిని అరెస్టు చేసే దాకా వచ్చాయి ఈ పరిస్థితులు. కేంద్ర మంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రాయ్గఢ్ జిల్లాలో సీఎం ఠాక్రేని ఉద్దేశించిన రాణే చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం.
రాయ్గఢ్ జిల్లాలో జరిగిన జన్ ఆశీర్వాద్ యాత్రలో కేంద్రమంత్రి నారాయణ రాణే, సీఎం ఉద్ధవ్ ఠాక్రేని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని ఉద్ధవ్ ఠాక్రేను కొట్టాలనేంత కోవం వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యామంత్రికి దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని పక్కనున్న వ్యక్తిని అడిగి తెలుసుకున్నారన్నారు. తాను అక్కడుంటే ఉద్ధవ్ ఠాక్రేను కొట్టేవాడినన్నారు.
కేంద్రమంత్రి నారాయణ రాణే వ్యాఖ్యలపై శివసేన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాణే రత్నగిరి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేయగా.. పిటిషన్ను రద్దు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నారాయణ రాణేను అరెస్టు చేశారు.