మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్ రాజకీయాలకు తెరలేపడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ముందుగా గుజరాత్లోని సూరత్ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంకు మకాం మార్చారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవాప్తంగా ‘మహా’ సంక్షోభం తాజాగా హాట్ టాపిక్గా మారింది.
ఈ పరిణామాల మధ్యే ఓ శివసేన ఎమ్మెల్యే కనిపించకుండా పోవటం ఆందోళనలకు దారి తీసింది. సోమవారం నుంచి బాలాపూర్ ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ అదృశ్యమయ్యారు. ఈ మిస్సింగ్పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన మహారాష్ట్రకు తిరిగొచ్చారు. ఏక్నాథ్ షిండేని నమ్మి ఆయనతో పాటు గుజరాత్ వెళ్లానని, అక్కడి పోలీసులు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు నితిన్ దేశ్ముఖ్. అంతేకాక ఆయన మనుషులు తనను బలవంతంగా గుజరాత్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, కానీ తప్పించుకుని వచ్చానని చెప్పారు.
ఈ సందర్భంగా నితిన్ దేశ్ముఖ మాట్లాడుతూ… “నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అదంతా అబద్ధం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా బ్లడ్ ప్రెజర్ పెరిగిందన్న మాటలో వాస్తవం లేదు” అని స్పష్టం చేశారు. గుజరాత్ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పుకార్లు పుట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆసుపత్రిలో ఓ పాతిక మంది చుట్టుముట్టి తనకు బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారో, అందులో ఏముందో తనకు తెలియదని చెప్పారు. నాకు అనారోగ్యం కలిగించాలనే ఉద్దేశంతోనే అలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను థాక్రే సైనికుడినని, ఆయనతో ఇప్పటికే మాట్లాడానని, ప్రస్తుతానికి స్వగృహానికి వెళ్తున్నానని వెల్లడించారు నితిన్ దేశ్ముఖ్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.