వాహనదారులకు షాకింగ్ న్యూస్ ఇకపై అలా డ్రైవ్ చేస్తే ఆటోమేటిక్ గా చలాన్లు పడిపోతాయి. ప్రమాదాల కట్టడికి ట్రాఫిక్ పోలీస్ విభాగం ఆటోమేటిక్ చలాన్లు విధించేందుకు చర్యలు తీసుకుంటుంది.
నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లే వారు, ఇతర పనుల నిమిత్తం ప్రయాణం చేసేవారి సంఖ్య ఎక్కువై పోతుంది. కొందరు సొంత వాహనాలు ద్వారా మరికొందరు ప్రైవేట్ వాహనాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి సొంత వాహనాల సంఖ్య పెరిగిపోయింది. దీంతో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయింది. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ పలు చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు ప్రమాదాల నివారణ కొరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ఛలాన్లు విధిస్తూ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ వారు చర్యలు తీసుకుంటున్నారు.
వాహన దారులకు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ వారు పలు సూచనలు చేసినప్పటికి అవేమీ పట్టించుకోకుండా ఇష్టా రీతిలో వాహనాలను నడుపుతూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగాస్తూ ప్రమాదాలకు గురవుతుంటారు. ముఖ్యంగా వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్లడం, హెల్మెట్ ధరించకుండా వెళ్లడం, అధిక స్పీడుతో రాష్ డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ కారణంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చింది. ఇక నుంచి ఎక్కువ స్పీడుతో డ్రైవింగ్ చేసేవారికి ఆటోమేటిక్ గా చలాన్లు విధించే విధంగా గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు వినూత్న పద్దతిని అమల్లోకి తీసుకువచ్చారు. ఇకపై ఎవరైనా ఇష్టారీతిలో అతివేగంతో వాహనాలు నడిపితే వారికి ఆటోమేటిక్ గా చలాన్లు పడతాయని హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
చెన్నై నగరంలో గంటకు 40 కి.మీ కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే ఆటోమేటిక్ గా చలాన్లు పడే విధంగా స్పీడ్ రాడార్ గన్స్ ను నగర రోడ్లపై ఏర్పాటు చేశారు. అధిక స్పీడుతో వెళ్లే వారిని గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసుల తాజా నిబంధనల ప్రకారంఉదయం 07 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గంటకు 40 కి.మీ కంటే అధిక వేగంతో వాహనం నడపకూడదు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గంటకు 50 కి. మీ కంటే అధిక వేగంతో నడపకూడదు. అయితే ఈ స్పీడ్ పరిమితి వాహనాలను బట్టి మారుతుంటుంది. అలా నడిపితే ఆటోమేటిక్ గా చలాన్లు పడిపోతాయి. దీనిపై ట్రాఫిక్ పోలీస్ కమీషనర్ శంకర్ జైవాల్ మాట్లాడుతూ బైక్ రేసింగ్ ల పేరుతో, రోడ్లపై అధిక వేగంతో వాహనాలు నడిపే వారికి కళ్లేం వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.