ప్రభుత్వ ఉద్యోగి అంటే ఆ దర్పమే వేరు. ఆదివారాలు సెలవు రోజుల్లో వర్క్ టెన్షన్ అంతా పక్కన పెట్టి కుటుంబంతో సరదాగా గడుపుతారు. కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి మాత్రం అడుక్కునేందుకు తనకు సెలవు కావాలని పై అధికారులను కోరి అందరిని ఆశ్చర్య పరిచాడు. మధ్యప్రదేశ్కు చెందిన రాజ్కుమార్ యాదవ్ డిప్యూటీ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. ‘ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి.. దయచేసి నాకు సెలవు మంజూరు చేయమంటూ’ తన పైఅధికారులను అభ్యర్ధించాడు. దీంతో పైఅధికారులు షాక్ అయ్యారు. ఏంటీ ఇలా అడుగుతున్నావ్, అడుక్కోవడం దేనికి అని రాజ్కుమార్ను ప్రశ్నించిన ఉన్నతాధికారులు.. అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.తనకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని.. అందుకే భిక్షాటన చేయాలనుకుంటున్నాని తెలిపాడు.
అంతేకాక తనలోని అహాన్ని చెరిపివేయడానికి మతపరమైన అన్వేషణ చేస్తూ.. ఆత్మ శోధన చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు రాజ్కుమార్.మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పూర్వ జన్మలో రాజ్కుమార్, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దున్ ఓవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముగ్గురు మంచి స్నేహితులట. వీరంతా మహాభారత కాలంలో స్నేహితులుగా ఉండేవారట. ఇక వీరిలో ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడు కాగా మోహన్ భగవత్ శకుని మామ అట. గత జన్మలో వీరు ఇద్దరు రాజ్కుమార్ ప్రాణ స్నేహితులట. అంతేకాక ఆదివారం సెలవు పెట్టి భిక్షాటనతో పాటు మరన్ని గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీత పారాయణం కూడా చేయాలని భావిస్తున్నట్లు రాజ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నాడు.
ఇక ఈ లేఖ చదివిన రాజ్కుమార్ ఉన్నతాధికారులు ఇచ్చిన రిప్లై కూడా మరింత ఫన్నీగా ఉంది. జనపద్ పంచాయితీ సీఈఓ పరాగ్ పంథి, “ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్, మీరు మీ అహాన్ని చెరిపివేయాలనుకుంటున్నారు, ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ లక్ష్యాన్ని సాధించడంలో మా సహకారం మీకు సహాయపడుతుంది. ఈ అహాన్ని దాని మూలాల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరం’’ అని రిప్లై ఇచ్చారు. ఈ లీవ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రాజ్కుమార్ లీవ్ లెటర్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.