బిడ్డకు తల్లి ఒడిని మించిన సురక్షితమైన ప్రదేశం మరోకటి ఈ లోకంలో లేదు. అమ్మ అంటే అమితమైన అనురాగం, ప్రేమకు ప్రతి రూపం. కష్టాలను ఎదుర్కొని.. కేవలం బిడ్డల కోసమే బతికే మాతృ మూర్తులెందరో ఈ లోకంలో ఉన్నారు. అలాంటి తల్లి మరణిస్తే.. ఆ బిడ్డ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది ఐదు సంవత్సరాల ఓ చిన్నారి. చనిపయిన తల్లిని.. నిద్ర పోతుందని భావించి.. అలానే రోజులు గడుపుతుంది. చివరకు చుట్టుపక్కల వారు ఆరా తీసి.. చిన్నారి తల్లి చనిపోయిందని చెప్పడంతో గుండెలు పగిలేలా రోదిస్తుంది. ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఈ హృదయవిదారక సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఒడిశా బలంగిర్ పట్టణానికి చెందిన మహిళను కొన్నేళ్ల క్రితమే భర్త వదిలేశాడు. అప్పటికే వారికి ఓ కుమార్తె ఉంది. బతకడానికి ఎలాంటి ఆధారం లేకపోయినా.. బిడ్డ కోసం జీవించాలని భావించింది ఆ తల్లి. ఈ క్రమంలో సాగర్పద ప్రాంతంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని కుమార్తె కలిసి ఉండేది. ఇళ్లలో పాచి పని చేస్తూ.. కుమార్తెను పోషిస్తుండేది. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి సదరు మహిళ అనారోగ్యంతో బాధపడుతుంది.
రోజులానే ఇళ్లలో పని చేసుకుని వచ్చి.. నిద్రపోయింది. అలా నిద్రలోనే శాశ్వతంగా కన్ను మూసింది. ఇదేం తెలియని ఐదేళ్ల చిన్నారి.. అమ్మ ఇంకా పడుకునే ఉందని భావించి.. ఇంట్లోనే తల్లి శవం పక్కనే ఆడుకోసాగింది. తల్లి మరణించిన రెండు రోజుల తర్వాత ఆమె నోటి నుంచి పురుగులు రావడంతో భయపడ్డ చిన్నారి.. బయకు పరిగెత్తి.. ఇరుకుపొరుగు వారికి దీని గురించి తెలిపింది. వారు వచ్చి చూసి మూడు రోజుల క్రితమే మహిళ చనిపోయిందని నిర్థారించారు. మున్సిపాలిటీ వారికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి.. మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక అమ్మ కావాలంటూ ఏడుస్తున్న చిన్నారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఆ పసిదాని బాధ ప్రతి ఒక్కరి హృదయాన్ని పిండేసింది.