అపార్ట్మెంట్ లో 400 మందికి పైగా నివాసం ఉంటున్నారు. ఒక ఫ్లాట్ లో పెళ్లి వేడుక ఉందంటే పెద్ద సంఖ్యలో అతిథులు అపార్ట్మెంట్ కి చేరుకున్నారు. అందరూ పెళ్ళికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. కొన్ని గంటల్లో అంగరంగ వైభవంగా పెళ్లి కాబోతుందని అందరూ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. కానీ ఒక్కసారిగా చావు వీళ్ళని వెతుక్కుంటూ వచ్చింది. అగ్ని రూపంలో వచ్చిన చావు అపార్ట్మెంట్ ని చుట్టి ముట్టింది. అందరూ చూస్తుండగానే సజీవ దహనం అయ్యారు. పెళ్లి కోసమని వచ్చిన అతిథులు కళ్లెదుటే కాలిపోతుంటే చూసి తట్టుకోలేక గుండెలవిసేలా బాదుకున్నారు స్థానికులు. ఫైర్ సిబ్బంది వచ్చే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో పెద్దలతో పాటు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు.
ఈ హృదయవిదారక ఘటన ఝార్ఖండ్ లో ధన్ బాద్ లోని ఆశీర్వాద్ అపార్ట్మెంట్ లో చోటు చేసుకుంది. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో అతిథులు అపార్ట్మెంట్ కు చేరుకున్నారు. 13 అంతస్తుల అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండో అంతస్తులో మొదలైన మంటలు.. ఆ తర్వాత మిగతా అంతస్తులకు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 14 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో 10 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. కొందరికి తీవ్రగాయాలు అవ్వడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ అపార్ట్మెంట్ లో 400 మంది నివాసం ఉంటున్నారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణం ఏంటో తెలియాల్సి ఉంది. ధన్ బాద్ డిప్యూటీ కమిషనర్ సందీప్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలానే క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. 3 రోజుల క్రితమే ఝార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లాలో ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన మరువక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased in the fire in Dhanbad. The injured would be given Rs. 50,000: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 31, 2023