ఒకప్పుడు మోసం అనేది చాలా పెద్ద విషయం. ఇప్పుడు మాత్రం ఎంత పెద్ద మోసం చేస్తే అంత పేరు, హోదా వస్తుంది. ఇలాంటి వైట్ కాలర్ ఫ్రాడ్స్ కి ఆన్లైన్ వేదిక అవుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రియేట్ చేస్తున్న కంటెంట్ కి.. పైరేటెడ్ వెర్షన్ రిలీజ్ చేస్తూ.. మూవీ రూల్జ్ సైట్ ఇప్పటికే మేకర్స్ కి చుక్కలు చూపిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో దీనికి తోడు తోప్ టీవీ అనే పైరేటెడ్ యాప్ పుట్టుకొచ్చింది.
టెలివిజన్ లో ప్రసారమయ్యే ఏ ఛానెల్ కంటెంట్ అయినా.. ఈ యాప్ లోకి లాగిన్ అయ్యి ఫ్రీగా వీక్షించవచ్చు. ఇక్కడ అన్ని ఛానెల్స్ పోగ్రామ్స్ హెచ్.డి. క్వాలిటీతో స్ట్రీమింగ్ అవుతుంటాయి. అయితే.., ఇదంతా అనధికారికంగా నడుస్తోన్న వ్యవహారం. ఈ తోప్ టీవీ కారణంగా టెలివిజన్ రంగం ఏటా కొన్ని వందల కోట్ల రెవెన్యూ కోల్పోతూ వస్తోంది.
ఇక హాట్ స్టార్, జీ5, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ యాప్స్ కి కూడా ఈ తోప్ టీవీ ఇన్ని రోజులుగా సవాలుగా నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా మన దేశంలో క్రికెట్ మ్యాచ్ లను వీక్షించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే.., మ్యాచ్ లను ఎక్కువ మంది ఈ తోప్ టీవీలో చూడటం వల్ల.. హక్కులు కొనుగోలు చేసి ప్రసారం చేస్తున్న సంస్థలు చాలా నష్టాలను అనుభవించాల్సి వస్తోంది. దీంతో.. తోప్ టీవీపై చాలా మీడియా హౌసెస్ అధిక స్థాయిలో కంప్లైంట్స్ రైజ్ చేశాయి.
ఇక తాజాగా తోప్ టీవీ సీఈఓ సతీశ్ వెంకటేశ్వర్లును ముంబై పోలీసులు తెలంగాణలో అరెస్ట్ చేశారు. సతీశ్ వెంకటేశ్వర్లుది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకి చెందిన గుఱ్ఱం గూడ గ్రామం. స్వస్థలానికి విచ్చేసిన ఆయన్ని ముంబై పోలీసులు చాకచక్యంగా మాటు వేసి పట్టుకున్నారు. సతీశ్ వెంకటేశ్వర్లు అరెస్ట్ తో టెలివిజన్ రంగం ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. మరి.. ఇకనైనా తోప్ టీవీ పైరేటెడ్ స్ట్రీమింగ్ కి చెక్ పడినట్టే అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.