న్యూ ఢిల్లీ- కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. భారత్ లో అయితే స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అందుకు తోడు కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. దేశంలో జీఎస్టీ వసూళ్లు రికార్డ్ స్థాయిలో వసూలు అయ్యాయి. 2021 ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు 1 లక్ష 41 వేల 384 కోట్లుగా నమోదయ్యాయి. ఇవి ఆల్ టైమ్ గరిష్ట వసూళ్లు అని అధికారులు చెబుతున్నారు.
జీఎస్టీ వసూళ్లలో సీజీఎస్టీ వసూళ్లు 27 వేల 837 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు 35, వేల 621 కోట్లుగా నమోదయ్యాయి. ఐజీఎస్టీ వసూళ్ల వాటా 68 వేల 481 కోట్లుగా ఉంది. సెస్ల రూపంలో మరో 9 వేల 445 కోట్లు వసూలయ్యాయి. దేశంలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నా కూడా జీఎస్టీ వసూళ్లు ఈ స్థాయిలో ఉండటం కేంద్ర ప్రభుత్వానికి ఎంతో ఊరతనిచే అంశమని చెప్పవచ్చు. వ్యాపారులు జీఎస్టీ బకాయిలను క్రమం తప్పకుండా చెల్లించడం వల్ల ఈ స్థాయి వసూలు సాధ్యమయ్యాయని తెలుస్తోంది. జీఎస్టీ అమలు చేసిన దగ్గరి నుంచి చూస్తే ఈ స్థాయి వసూళ్లు నమోదు కావడం ఇదే మొదటిసారి. మార్చి నెల వసూళ్లతో పోలిస్తే ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు 14 శాతం మేర పెరిగాయని అధికారులు తెలిపారు.