న్యూయార్క్- ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళను గమనించారా.. ఈమె ఎవరో గుర్తు పట్టారా.. ఆ ఎవరుంటారు.. ఏ సినిమా హీరోయినో.. లేదంటే ఫ్యాషన్ ప్రియురాలో అయి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. ఐతే మీరు ఖచ్చితంగా పొరపాటు పడ్డారు. ఎందుకంటే ఆధునిక ఫ్యాషన్ దుస్తుల్లో కనిపిస్తున్న ఆమె మన అచ్చ తెలుగు మహిళ, అందులోను ప్రముఖ పారిశ్రామికవేత్త భార్య కావడం విశేషం.
అమెరికాలోని న్యూయార్క్ లో సోమవారం రాత్రి జరిగిన మెట్ గాలా 2021 మెగా ఫ్యాషన్ ఈవెంట్ సందడిగా జరిగింది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి పలువురు అందగత్తెలు పాల్గొన్న ఈ ఈవెంట్లో మన దేశం నుంచి సుధారెడ్డి ఒక్కరే పాల్గొన్నారు. ఇంకేముందు ప్రస్తుతం ఆమె పేరు మార్మోగిపోతోంది. అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై సందడి చేసిన ఈ సుధారెడ్డి ఎవరో తెలుసా మరి..
సుధా రెడ్డి ఎవరో కాదు.. మన తెలుగు మహిళే. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త మేఘా కృష్ణారెడ్డి భార్య. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ కూడా ఈ సుధా రెడ్డి. ఇక మెట్ గాలా 2021 ఈవెంట్లో ఆమె ధరించిన గౌను ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అమెరికా జాతీయ పతాకాన్ని పోలిన ఈ గౌనును బంగారు రంగులో ప్రత్యేకంగా తయారుచేశారు. మెట్ గాలా 2021 ఈ ఏడాది థీమ్ అయినటువంటి అమెరికన్ ఇండిపెండెన్స్ కు తగ్గట్టుగా తీర్చి దిద్దారు.
ఆ దేశ జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్ డిజైనర్లు ఫల్గుని, షేన్ పీకాక్ ఈ గౌనును ప్రత్యేకంగా రూపొందించారు. ఈ గౌను తయారీకి ఏకంగా 250 గంటల సమయం పట్టిందని డిజైనర్లు చెప్పారు. ఇలా ప్రత్యేక హంగులతో డిజైన్ చేసిన ఈ గౌనులో సుధారెడ్డి మెరిసిపోయారు. మెట్ గాలా 2021 ఈవెంట్లో రెడ్ కార్పెట్పై ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సెలబ్రిటీలు తమ హొయలను ఒలికించారు. అలాంటి ఈ భారీ ఈవెంట్లో ఈసారి భారత్ నుంచి ఆర్ట్, ఫ్యాషన్ అంటే చాలా ఇష్టపడే సుధా రెడ్డి మాత్రమే పాల్గొన్నారు.
మెట్ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలతో పాటు ఇషా అంబానీ మాత్రమే పాల్గొన్నారు. ఇప్పుడు ఆ ఛాన్స్ ను సుధారెడ్డి దక్కించుకున్నారు.