పెళ్లంటే నూరేళ్ల పంట.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలంటారు పెద్దలు. కానీ నేటి యువతరం పెళ్లి విషయంలో మరింత ముందుకెళ్లి తమ ఆసక్తులు కూడా కలవాలంటూ.. డబ్బు కంటే చదువుకే ప్రాధాన్యమిస్తుంది. అన్నిటికి మించి కులాంతర వివాహమైనా అభ్యంతరం లేదంటున్నారు. ఇటీవల తెలుగు మ్యాట్రిమోనీ సంస్థ చేపట్టిన పరిశోధనలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సర్వేలో కులాంతర వివాహనికి అభ్యంతరం లేదంటూ 16.4 శాతం మంది అమ్మాయిలు, 24.3 శాతం మంది అబ్బాయిలు తెలిపినట్లు సమాచారం. పదేళ్ల క్రితం కులాంతర వివాహానికి సిద్దపడే వారి శాతం సింగిల్ డిజిట్ లో ఉండగా.. ఇప్పుడు ఈ స్థాయిలో మార్పు రావడం గమన్హారం. యువతి, యువకులు జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకుంటున్నారు? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? వంటి తదితర అంశాలపై కూడా ఈ సంస్థ పరిశోధన చేపట్టింది.ఈ పరిశోధనలో అబ్బాయిల కంటే అమ్మాయిలు తమ ఆస్తులకు అనుగుణంగా జోడిని ఎంచుకుంటున్నట్లు తెలుస్తుంది. 22 శాతం మంది అమ్మాయిలు పెళ్లి విషయంలో తమ అభిప్రాయాలను ధైర్యంగా వెల్లడిస్తున్నారు. ఎక్కువ మంది విద్యావంతులకు ప్రాధాన్యమిస్తుండగా, కొద్దిమంది మాత్రం ఆస్తులు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వే తెలిపింది. మరి నేటితరం పెళ్లిళ్లు, యువతరం ఆలోచనా విధానం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.