అమరావతి- ఆంధ్రప్రదేశ్లో కర్ఫూను ఈనెలాఖరు వరకు పొడగించారు. రేపటితో కర్ఫ్యూ ముగుస్తున్న నేపధ్యంలో ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఉదయం 6 నుంచి 12 వరకు కర్ఫ్యూ నుంచి సడలింపును ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్రంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని సీఎం జగన్ క్యాబినెట్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. అయితే కర్ఫ్యూ సడలింపులను తగ్గించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించి 10 రోజులు మాత్రమే అయిందని జగన్ సమావేశంలో చెప్పారు. కరోనా కేసులు తగ్గాలంటే కనీసం నాలుగు వారాలు కర్ఫ్యూ ఉండాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెరుగుతున్న పాజిటివిటీ రేటు, కరోనా కేసులపై మంత్రివర్గంలో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా పరిస్థితుల నేపధ్యంలో తీసుకుంటున్న చర్యల్లో వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు.ప్రధానంగా కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోయి, అనాధలుగా మారిన పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు. అలాంటి పిల్లలను గుర్తించి వారికి ఆర్థిక సాయం చేసే అంశంపై కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఇక కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం జగన్ అధికారును ఆదేశించారు. కరోనా రోగులకు చికిత్స అందించే విశయంలో ఎట్టిపరిస్థితుల్లోను రాజీ పడవద్దని చెప్పారు. అందరికి ఆస్పత్రుల్లో బెడ్ ఏర్పాటు చేసి చికిత్స అందించాలని చెప్పారు. మరోవైపు వ్యాక్సిన్ పైనా క్యాబినెట్ సమావేశంలో చర్చించారు. గ్లోబల్ టెండర్ల ద్వార పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డోసులను సేకరించి, టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.