ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదనే మనుషులకు లక్ష్యంగా మారింది. అడ్డదారులు తొక్కైనా సరే.. డబ్బుల సంపాదించాలి.. త్వరగా కోటీశ్వరులు కావాలి. ఇదే ఆలోచన చాలా మందిలో ఉంది. అందుకోసం రకరకాల అడ్డదారులు వెతుక్కుంటున్నారు. అమాయకులకు గాలం వేసి లక్షలు దండుకుంటున్నారు. చివరకు పోలీసులు చేతికి చిక్కి ఊచలు లెక్కిపెట్టే పరిస్థితి వస్తే కానీ అప్పుడు అర్థం కాదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ.. బాగా పాపులర్ అయ్యారు. కానీ త్వరలగా కోటీశ్వరులు కావాలని వారికి అత్యాశ. దాంతో ఓ మార్గం ఎంచుకున్నారు. బాగా డబ్బున్న వృద్ధుడిని సెలక్ట్ చేసుకుని.. అతడితో అఫైర్ పెట్టుకుంది భార్య. భర్త.. వారిద్దరూ క్లోజ్గా ఉండగా వీడియోలు తీసి.. వాటిని వృద్ధుడిని పంపి.. బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో డబ్బు గుంజారు. చివరకు వృద్ధుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
కేరళ మలప్పురానికి చెందిన జంట రషీదా, ఆమె భర్త.. నిషాద్ ఇద్దరు యూట్యూబర్లు. సోషల్ మీడియాలో వీళ్లకు మంచి పేరు ఉంది. వ్లాగర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ జంట పైకి కనిపించేంత అమాయకులు మాత్రం కాదు. ఇద్దరికి డబ్బు పిచ్చి. కానీ యూట్యూబ్ మీద వచ్చే ఆదాయం వారికి చాలడం లేదు. ఏం చేద్దామా అని ఆలోచించి.. చివరకు డబ్బున్న వృద్ధులకు ఎర వేద్దామని కలిసి నిర్ణయం తీసుకున్నారు. వారి ప్లాన్లో భాగంగా రషీదా.. బాగా డబ్బున్న ఓ వృద్ధుడిని సెలక్ట్ చేసుకుని.. అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది.
సదరు వృద్ధుడు రషీదా పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్ని ఓకే చేశాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. చాటింగ్ చేసుకోసాగారు. ఓ సారి మాటల సందర్భంలో మీరంటే ఇష్టం.. ఒప్పుకుంటే ఎంజాయ్ చేద్దామంటూ కవ్వించింది. దాంతో వృద్ధుడు వారి వలలో పడ్డాడు. రషీదా ఆహ్వానం మేరకు ఓ రోజు అలువాలోని ఆమె ఇంటికి వెళ్లాడు. అప్పుడు రషీదా.. భర్తకు తమ రిలేషన్ గురించి తెలుసని.. అతడికి ఎలాంటి అభ్యంతరం లేదని.. ఆయన అంగీకారంతోనే ఇవన్ని చేస్తున్నాని చెప్పింది రషీదా.
నిజమే అనుకున్న వృద్ధుడు.. రషీదాతో క్లోజ్గా మూవ్ అయ్యాడు. వీటన్నింటిని రషీదా భర్త.. వీడియో తీయడం కోసం సీక్రెట్ కెమరాలు ఏర్పాటు చేశాడు. ఇక రషీదా, వృద్ధుడు సన్నిహితంగా ఉన్న వీడియోలు రికార్డ్.. చేసి.. వాటితో వృద్ధుడిని బెదిరించసాగారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. వీడియోలను వృద్ధుడి కుటుంబ సభ్యులకు చూపుతామని బెదిరించి.. ఏడాది కాలంలో సుమారు 23 లక్షల రూపాయలు వసూలు చేశారు రషీదా దంపతులు. అక్కడితో ఆగక.. ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ వేధించసాగారు.
రషీదా వేధింపులు తట్టుకోలేక.. జరిగిన సంఘటన గురించి ఇంట్లో చెప్పుకోలేక వృద్ధుడు ఎంతో బాధపడ్డాడు. అతడి ప్రవర్తనలో మార్పు గమనించిన కుటుంబ సభ్యులు ఏమైందని ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో వృద్ధుడి కుటుంబ సభ్యులు.. రషీదా, ఆమె భర్త మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రషీదా దంపతులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రషీదా బెయిల్ మీద బయటకు రాగా.. భర్త నిషాద్ మాత్రం జైల్లోనే ఉన్నాడు.