సమాజంలో వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఈక్రమంలో అనేక దారుణ ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా వీటిపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం ఈ వివాహేతర సంబంధాలు, సహజీవనం, వ్యభిచారం వంటి వాటిపై సంచలన తీర్పులు ఇచ్చింది. వీటిలో కొన్ని విషయాలను నేరంగా పరిగణించలేమని కూడా కోర్టు చెప్పిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా సహజీవనం,అక్రమ సంబంధాలు, ఇతర లైంగిక చర్యలు నేరంగా భావిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వాటిని నేరంగా పేర్కొంటు శిక్షలు ఖరారు చేస్తూ ప్రభుత్వం చట్టంలో కూడ మార్పులు చేసింది. అయితే ఈ సవరణలు చేసింది భారత ప్రభుత్వం కాదు.. ఇండోనేషియా ప్రభుత్వం. మరీ.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ఇండోనేషియా ప్రభుత్వం వివాహేతర సంబంధాలు, సహజీవనం వంటి విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై ఇలాంటివి నేరంగా పేర్కొంటూ శిక్షలను సైతం ఖరారు చేస్తూ చట్టంలో కీలక మార్పులు చేసింది. ఇండోనేషియా ప్రభుత్వం వివాదాస్పంద నేర శిక్షాస్మృతి సవరణ బిల్లుకు నవంబర్ లో తుది రూపునిచ్చింది. మంగళవారం ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ఆ దేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. సవరించిన నేర శిక్షాస్మృతి చట్టం ప్రకారం.. స్త్రీ, పురుషుల్లో ఎవరైనా వివాహేతర సంబంధం పెట్టుకుంటే నేరంగా ఆ దేశ ప్రభుత్వం పరిగణించింది. అంతేకాక ఈ నేరానికి శిక్షగా ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తారు. అదే విధంగా ఎవరైన సహజీవనం చేసినట్లు తెలితే వారికి ఆరునెలల జైలు శిక్ష విధిస్తారు. స్త్రీ, పురుషుల్లో ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే..వారి జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేయవచ్చు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు.
ఇది కేవలం ఆ దేశం వారికే కాకుండా పర్యాటకంలో భాగంగా ఇండోనేషియాకు వచ్చే ఇతర దేశాలకు వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టసవరణలతో పాటు ఇండోనేషియా ప్రభుత్వం మరికొన్ని అంశాలపై మార్పులు చేసింది. దైవ దూషణ, అబార్షన్ లు ఇకపై నేరంగా పరిగణిస్తారు. అంతేకాక దేశాధ్యక్షుడు, ప్రభుత్వ అధికారులను , సంస్థలను విమర్శించడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. తనపై వచ్చే విమర్శల విషయంలో దేశాధ్యక్షుడే ఫిర్యాదు చేస్తే నిందితుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అయితే ఇండోనేషియ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల్లోని కొన్ని విషయాలపై కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తోన్నారు. భావ ప్రకటనా, స్వేచ్చను కాలరేసేలా కొన్ని నిబంధలను ఉన్నాయని మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయా దేశాలు తమకు అనుకూలంగా చట్టాలను సవరించుకుంటాయని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తోన్నారు.