ప్రస్తుతం ప్రపంచమంతా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం గురించే చర్చిస్తోంది. ఈ రెండు దేశాలు కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా పోరులో తలబడుతున్నాయి. ఓవైపు ఉక్రెయిన్ పై బాంబుల దాడి జరుగుతోంది. అందరూ స్వదేశాలకు పరుగులు తీస్తున్నారు. బయట అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి తరుణంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని స్వదేశాలకు వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓ యువ వైద్యుడు మాత్రం యుద్ధం వచ్చినా.. ఏదొచ్చినా తగ్గేదేలే అంటూ అక్కడే ఉంటానని షాకిచ్చాడు.
అసలు విషయానికి వస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన వైద్యుడు బండి గిరి కుమార్.. అలియాస్ యూట్యూబర్ జాగ్వర్ కుమార్.. ఉక్రెయిన్ లోని డాన్ బాస్ సెవెరోడోనెస్క్ ఏరియాలో ఉన్న తన అపార్టుమెంట్ అండర్ గ్రౌండ్ లో ఒంటరిగా ఉండిపోయాడు. అయితే.. ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా స్వదేశానికి మాత్రం రాను అని చెబుతున్నాడు. అందుకు తగిన కారణం లేకపోలేదు.2007లో వైద్య విద్యకోసం ఉక్రెయిన్ కి వెళ్లిన కుమార్.. అక్కడే ఎముకల వైద్యనిపుణుడుగా స్థిరపడ్డాడు. 2020లో ఓ జూ నుండి జాగ్వర్ అనే చిరుతపులిని తెచ్చుకొని పెంచుతున్నాడు. అలాగే రెండు నెలలుగా సబీనా అనే బ్లాక్ పాంథర్ ని పెంచుకుంటున్నాడు. ఇవేగాక కొన్ని ఇటాలియన్ కుక్కపిల్లలు కూడా కుమార్ దగ్గర పెరుగుతున్నాయి. ఇక యుద్ధం నేపథ్యంలో కుమార్ ని స్వదేశానికి రావాల్సిందిగా చాలా మంది అడుగుతున్నారు.
స్వదేశానికి రావడానికి కుమార్ ససేమిరా అంటున్నాడు. ‘తనతో పెరుగుతున్న మూగజీవాలను వదిలి రాలేనని, అవి లేని జీవితాన్ని ఊహించుకోలేను. అదీగాక వీటిని స్వదేశానికి తీసుకెళ్లాలంటే చాలా అనుమతులు కావాలి. ఇప్పట్లో జరిగే పనికాదు. భారత రాయబార అధికారులు, ఉక్రెయిన్ అధికారులు ఎవరూ నన్ను సంప్రదించలేదు. అందుకే చావైనా బతుకైనా వీటితోనే అని ఫిక్స్ అయ్యాను. దేవుడి దయవల్ల అంతా సర్దుకునే వరకు ఇక్కడే ఉంటాను’ అని చెప్పినట్లు సమాచారం. మరి మూగజీవాలపై ఉన్న ఈ వైద్యుడి ఔదార్యం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.