ప్రకృతిలో చాలా మొక్కలు ఔషధాలుగా ఉపయోగపడతాయి. కానీ ప్రపంచంలో కొన్ని ముట్టుకుంటే చనిపోయే మొక్కలుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాస్త వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
మన ఇంటి ముందు చిన్న చిన్న మొక్కలను పెంచుకుంటాం. వాటిల్లో చాలా వరకు షో కొరకు పెంచుకుంటాం. ఇంటికి అలంకరణగా ఉండేందుకు కూడా మొక్కలను పెంచుకుంటారు. అయితే కొందరు మాత్రం మొక్కలపై విపరీతమైన ప్రేమతో కాపాడుతుంటారు. చెట్లను పెంచుతూ.. మిద్దెతోటలను కూడా పెంచుతుంటారు. ఇంటిపైన కూరగాయలు, తోటలు పెంచి ప్రకృతిని తలపింపజేస్తున్నారు. ఇది ఇంటివారికి ఆర్దిక వనరుగా కూడా సమకూరుతుంది. పచ్చని చెట్లు మనకు ప్రాణ వాయువునిస్తాయి. మొక్కలు ప్రకృతిలో అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. కొన్ని మొక్కలు ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే మనకు ప్రాణం పోసే మొక్కలు కొన్ని ఉంటాయి. అలాగే అత్యంత ప్రమాదకరమైన మొక్కలు కూడా ఉంటాయని.. ముట్టుకున్నంత మాత్రాన ప్రాణం తీసే మొక్కలు కూడా ఉంటాయి. వాటి వద్దకు వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం..
గింపీ-గింపీని అనే మొక్కలు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన మొక్కలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉర్టికేసి రేగుట జాతికి చెందిన ఈ సూసైడ్ మొక్కలు ఎక్కువగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా అడవుల్లో పెరుగుతాయి. అనుకోకుండా వీటి ఆకులను తాకితే భయంకరమైన పెయిన్ వస్తుందట. అంతేకాదు ఆత్మహత్య చేసుకునేలా ఇవి ప్రేరేపిస్తాయి. అందుకే వీటిని‘సూసైడ్ ప్లాంట్’ అని పేరు. ఆ మొక్కల వల్ల మనుషులకు, జంతువులకు కూడా హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 1886లో ఓ గుర్రం ఈ మొక్కను తాకిందట. తాకిన కొద్దిసేపటికే ఆ గుర్రం మతిస్థిమితం కోల్పోయి రెండు గంటల్లోనే ప్రాణాలు విడిచిందట.
గింపీ-గింపీ ఆకులు సన్నని సూదుల్లాంటివి కలిగి ఉంటాయి. ఆకులు తాకిన వెంటనే అవి గుచ్చుకుని చాలా నొప్పివస్తుందట. ఆ నొప్పి భరించలేక చనిపోవాలనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ మొక్కను తాకిన 30 నిమిషాల్లోనే దద్దుర్లు, వాపులు వచ్చి తీవ్రమైన నొప్పి కలుగుతుందని తెలిపారు. దీంతో నిద్రపోవడం కూడా కష్టతరమైన విషయమేనట. కాబట్టి గింపీ మొక్కను తాకకుండా జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు.