మన దేశంలో కోర్టులు వేసే శిక్షల్లో మరణశిక్షను పెద్దదిగా చెప్పొచ్చు. అంత ఈజీగా ఈ శిక్షను ఎవరికీ వేయరు. మరణశిక్షను విధించే విషయంలో కోర్టులు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయి. అయితే ఉత్తర కొరియా లాంటి దేశాలు దీనికి అతీతమనే చెప్పాలి. చిన్న చిన్న నేరాలకు కూడా అక్కడ డెత్ పెనాల్టీని విధిస్తుంటారు. సౌదీ అరేబియా కూడా అదే కోవలోకి వస్తుందని చెప్పొచ్చు. సౌదీ అరేబియాలో కూడా నార్త్ కొరియాలా చిన్న చిన్న నేరాలకు కూడా కఠిన శిక్షల్ని అమలు చేస్తుంటారు.
మానవ హక్కుల గురించి హడావుడి చేసే అమెరికా లాంటి దేశాలు సౌదీ అరేబియా లాంటి పలు దేశాల్లో జరిగే ఇలాంటి అంశాలపై మాట్లాడేందుకు అంతగా ఇష్టపడవు. ఇదిలాఉంటే.. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ హయాంలో ఆ దేశంలో అమలు చేస్తున్న మరణశిక్షల సంఖ్య భారీగా పెరుగుతోంది. అక్కడ ఏటేటా మరణశిక్షల సంఖ్య ఎక్కువవుతోందని తాజాగా ఓ రిపోర్టుతో స్పష్టమైంది. గడిచిన ఆరేడేళ్లలో సౌదీలో రికార్డు స్థాయిలో మరణశిక్షల అమలు సాగడం చర్చనీయాంశంగా మారింది.
సౌదీ అరేబియాలో 2015 నుంచి 2022 మధ్యకాలంలో ఏడాదికి సగటున 129 మరణశిక్షలు అమలయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2010–2014తో పోలిస్తే.. మరణశిక్షల సగటు 82 శాతం పెరిగిందని తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై మరణశిక్షలు ఎక్కువగా అమలవుతున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా అరబ్ దేశాల్లో డ్రగ్స్, అత్యాచారం, టెర్రరిజం లాంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి బహిరంగంగా ఉరి తీస్తుంటారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా.. రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులు ఈ లిస్టులో ఉండటం హాట్ టాపిక్ గా మారింది.