వారంలో ఒకసారైనా చికెన్ లేకపోతే చికెన్ ప్రియులకు ముద్ద దిగదు. ధర ఎంతున్నా కొనేందుకు వెనుకడుగు వేయరు. కానీ ఆ ధర మరీ 5, 6 రేట్లు అధికంగా ఉంటేనే ఆలోచించే పరిస్థితి వస్తుంది. కిలో చికెన్ కొనాలంటే రూ. 720. చికెన్ ధర మరీ ఇంత దారుణంగా పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఇంత దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉంది?
సీజన్ బట్టి చికెన్ ధరలు అనేవి మారుతుంటాయి. అన్ని సీజన్లలోనూ ఒకే ధరలు ఉండవు. కార్తీకమాసం లాంటి సీజన్ వస్తే చికెన్ ధరలు తగ్గుతాయి. ఆ సమయంలో పూజలు చేసేవాళ్ళు మాంసాహారం ముట్టరు. అలానే కొన్ని పండుగల్లో కూడా చికెన్ తినరు. ఈ కారణంగా చికెన్ డిమాండ్ తగ్గుతుంది. ధర కూడా తగ్గుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం చికెన్ ధరలు పెరిగిపోతాయి. డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది. మామూలుగా చికెన్ కి ఎప్పుడూ డిమాండ్ అనేది ఉంటుంది. ఎంత డిమాండ్ ఉన్నా గానీ కిలో చికెన్ రూ.350 కి మించదు. కానీ మరీ దారుణంగా కేజీ చికెన్ రూ. 720 ధర పలికింది. ఆల్ టైం రికార్డు ధర అని చెప్పవచ్చు.
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అక్కడ నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గోధుమ పిండి కోసం ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చింది. అంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్న పాకిస్తాన్ వాళ్లకి ఇప్పుడు చికెన్ అందని ద్రాక్షగా మారిపోయింది. కరాచీ సహా ఇతర నగరాల్లో కిలో చికెన్ ధర రూ. 720 కి చేరింది. ధర ఇంతలా పెరగడం పాకిస్తాన్ చరిత్రలో ఇదే తొలిసారి. చికెన్ ధరలు ఇంత దారుణంగా పెరగడానికి కారణం.. అక్కడ పౌల్ట్రీ వ్యాపారాలు మూతబడటమే అని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. కోళ్ల మేతకు తీవ్ర కొరత ఏర్పడిందని.. అందుకే పౌల్ట్రీ వ్యాపారులు తమ వ్యాపారాలను నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో చికెన్ ధర కొండెక్కింది.
ఇస్లామాబాద్, రావల్పిండి సహా పలు నగరాల్లో రూ. 700 నుంచి రూ. 705 ఉండగా.. కరాచీలో మాత్రం రూ. 720 ఉంది. లాహోర్ లో రూ. 550 నుంచి రూ. 600 మధ్య ఉంది. ధరలు భారీగా పెరగడంతో పాకిస్తాన్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.. ధరలు అధికంగా ఉండడం వల్ల ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న చికెన్ ను తినలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ధర పెరగడానికి కారణమైన ఫీడ్ కొరత విషయంపై పాకిస్తాన్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. కోళ్లకు అందించే మేత కొరత ఎందుకు ఏర్పడిందన్న విషయంపై విచారణ చేపట్టింది. చికెన్ ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది.
పౌల్ట్రీ పరిశ్రమ అనేది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైన వ్యాపారం. చికెన్ సరఫరా చైన్ కి అంతరాయం ఏర్పడితే దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పాక్ మీడియా వెల్లడించింది. మరి పాకిస్తాన్ లో కిలో చికెన్ రూ. 720 ఉండడంపై మీ అభిప్రాయం ఏమిటి? పాకిస్తాన్ లో ఈ సంక్షోభం తలెత్తడానికి కారణం ఎవరు? ఎవరు చేసిన తప్పు వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.