ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో భాగంగా బిజీగా గడుపుతోన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశమయ్యారు. గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో ప్రధాని విదేశీ పర్యటనలు చాలా వరకు తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకరణం చేసిన తర్వాత బైడెన్తో భారత ప్రదాని మోదీ ఇదే తొలి భేటీ.
ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో తొలి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రధాని నరేంద్ర మోదీ.. వైట్హౌజ్ భేటీలో జోకులేసుకున్నారు. మీ దేశంలో ఐదుగురు బైడెన్లు ఉన్నారు… అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. బైడెన్ అనే పేర్లు పలువురికి ఇంటి పేర్లుగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. 1972లో 28 ఏళ్ల వయసులో తాను తొలిసారి సేనేటర్గా ఎన్నికయ్యానని, ఆ సమయంలో ప్రమాణ స్వీకారానికి ముందు తనకు ముంబై నుంచి ఓ లెటర్ వచ్చిందని, బైడెన్ పేరుతో ఆ లేఖ ఉందని, ఆ వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని జో బైడెన్ అన్నారు.
అంతేకాదు.. తాను అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో ముంబై వచ్చిన సమయంలో కొందరు పాత్రికేయులు ఇదే విషయాన్ని తన వద్ద ప్రస్తావించారని తెలిపారు. ఆ తర్వాతి రోజు భారత్లో ఐదుగురు బైడెన్లు ఉన్నారని మీడియాలో వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అయితే మోదీతో సమావేశమైన నేపథ్యంలో ఆ వివరాలు తెలుస్తాయేమో అని సరదాగా అన్నారు. ఇక జో బైడెన్ చేసిన కామెంట్కు ప్రధాని మోదీ స్పందిస్తూ.. వారికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకువచ్చినట్లు చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య చిరనవ్వులు పూశాయి. భారత్లో బైడెన్ పేరుతో ఉన్న వారంతా జో బైడెన్ బంధువులేనని జోక్ వేశారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వారు. కాగా, నిన్నటి సమావేశంలో మోదీ, జో బైడెన్ ఇరు దేశాలకు సంబంధించిన అంశాలతో పాటు ఆఫ్ఘనిస్థాన్, ఇండో-పసిఫిక్ వంటి అంశాలపై చర్చలు జరిపారు.
Meeting @POTUS @JoeBiden at the White House. https://t.co/VqVbKAarOV
— Narendra Modi (@narendramodi) September 24, 2021